స్వతంత్ర వెబ్ డెస్క్: ఎమ్మెల్యే వనమా ఎఫెక్ట్ తో గులాబీ కోటలో నాయకులను కొత్త ఫీవర్ వెంటాడుతుందని చర్చ జరుగుతుంది. కూడికలు తీసివేతల కసరత్తు జరుగుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో పార్టీ అధినేత కేసిఆర్ ఇప్పటినుంచే కసరత్తు మొదలు పెట్టారని సమాచారం. నియోజకవర్గాల పెంపుపై పెట్టుకున్న ఆశలు గల్లంతవ్వడం, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు.. ఫలితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు ఆశించే వారి జాబితా పెరిగిపోవడంతో గులాబీ అధినేత వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టారని చర్చ జరుగుతోంది.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కూడా వివాదం నడుస్తోంది. అయితే, నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా రమేష్ పౌరసత్వం పొందారని ఆరోపణలు రావడంతో, కోర్టులో కేసు నడుస్తోంది. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎన్నికపై కూడా హైకోర్టులో కేసు విచారణ నడుస్తోంది. ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ కోర్టును ఆశ్రయించారు. ధర్మపురి నియోజకవర్గం ఎన్నికపై కూడా వివాదం నడుస్తోంది. ధర్మపురి నియోజకవర్గంలోని కొన్ని చోట్ల ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు, రీకౌంటింగ్లో అవకతవకలు జరిగాయని 2019లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అప్పటి నుంచి పలు దఫాలుగా ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.
మరోవైపు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ కు అర్హత లేదని, కొట్టివేయాలని కోరుతూ శ్రీనివాస్ గౌడ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరువర్గాల వాదనలు పూర్తి అయ్యాయి. శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది . పిటిషనర్ వేసిన పిటిషన్ ను విచారణకు అనుమతించింది. తాజాగా, తప్పుడు అఫిడవిట్ కేసులో ఎమ్మెల్యే వనమాపై వేటు పడగా.. ఇలానే రకరకాల ఆరోపణలతో కేసులు ఎదుర్కొంటున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.
దీంతో గులాబీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొంతమందికి టెన్షన్ పట్టుకుంది. సిట్టింగ్లకే తిరిగి టికెట్ అంటూ, గులాబీ బాస్ పైకి ఏదో చెబుతున్నా.. ఇంటి పోరుతో సిట్టింగ్ లో సతమతమైపోతున్నారు. మరోవైపు కేసీఆర్ సర్వే సిట్టింగులకు గుబులు రేపుతుందని సమాచారం. పార్టీలో గెలుపు జోష్ కనబడుతున్నా సిట్టింగ్ లు మాత్రం వనికి పోతున్నారు.