స్వతంత్ర వెబ్ డెస్క్: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించడంతో ఇద్దరు భారత సైనికులు కొట్టుకుపోయారు. సైనికులు సూరంకోట్ ప్రాంతంలోని డోగ్రా నల్లాను దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భారత సైన్యం తెలిపింది.
శనివారం రాత్రి నాయబ్ సుబేదార్ కులదీప్ సింగ్ మృతదేహాన్ని ప్రవాహం నుండి బయటకు తీయగా, ఈ రోజు సిపాయి తేలు రామ్ మృతదేహాన్ని వెలికితీశారు. పూంచ్ లోని క్లిష్టమైన భూభాగంలో డామినేషన్ పెట్రోలింగ్ సమయంలో నదిని దాటుతున్నప్పుడు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన ఎన్బి సబ్ కుల్దీప్ సింగ్ త్యాగానికి 16 కార్ప్స్ నివాళులు అర్పించింది. జమ్మూ కాశ్మీర్లో వరుసగా మూడో రోజు ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కథువా, సాంబా, జమ్మూ ప్రాంతంలోని ఇతర దిగువ పరివాహక ప్రాంతాలకు ముప్పు ఉందని, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని 24 గంటలు ప్రజలంతా అప్రమత్తమై ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.