స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనదైన శైలిలో కొత్త కొత్త ప్రయోగాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే అనేక కొత్త నిర్ణయాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ఆయన మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దూర ప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో టికెట్తో పాటు స్నాక్ బాక్స్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం టికెట్ ధరతో పాటు అదనంగా రూ.30 వసూలు చేయనున్నారు.
ఇప్పటివరకు ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారికి వాటర్ బాటిల్ మాత్రమే అందిస్తున్నారు. ఇకపై వాటర్ బాటిల్తో పాటు స్నాక్ బాక్స్ను కూడా టీఎస్ఆర్టీసీ ఇవ్వనుంది. నేటి నుంచి పైలట్ ప్రాజెక్టుగా దీనిని చేపట్టనుంది. ముందుగా హైదరాబాద్-విజయవాడ మధ్య సర్వీసులు అందిస్తున్న 9 ఎలక్ట్రిక్ గరుడ బస్సుల్లో స్నాక్ బాక్స్ అందించనుంది. ఈ స్నాక్స్ బాక్స్లో చిరుధాన్యాలతో తయారుచేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు టిష్యూ పేపర్, మౌత్ ప్రెషనర్ ఉంటాయి.
ప్రయాణికుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ను బట్టి రానున్న రోజుల్లో అన్ని ఏసీ బస్సుల్లో ఇవ్వాలని భావిస్తున్నారు. స్నాక్ బాక్స్లో ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానిని స్కాన్ చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యారాజ్యసమితి ప్రకటించడంతో చిరుధాన్యాలతో కూడా స్నాక్ బాక్స్ అందించాలని సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు.