ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సిబి రాజు మెమోరియల్ ట్రోఫీ పేరుతో ఏర్పాటు చేసిన మెన్స్ అండ్ ఉమెన్స్ టెన్నిస్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో గెలుపొందిన మహిళా క్రీడాకారులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ తో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులకు ఇది ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. తనకు క్రీడలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. తాను సూపర్ స్టార్ కృష్ణకి వీరాభిమానినని, తాను చూసే అతికొద్ది సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే ఎక్కువ అని తెలిపారు. నిర్మాత ఆదిశేషగిరిరావు చేస్తున్న కార్యక్రమాల్ని కూడా ఫాలో అవుతుంటానని చెప్పారు.
ఈ టోర్నమెంట్ లో సింగిల్స్ విభాగంలో ఆకాంక్ష విన్నర్ గా నిలవగా, అభయ వేమూరి రన్నర్గా గెలుపొందారు.
డబుల్స్ ఫైనల్స్ లో మొదటి స్థానం లో ఆకాంక్ష, యుబరాణి బెనర్జీ నిలవగా రెండో స్థానంలో మేధావి సింగ్, ఆయుషా సింగ్ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, క్లబ్ అధ్యక్షుడు ఆది శేషగిరిరావు మాట్లాడుతూ దేశంలో కోవిడ్ తర్వాత రూ. 10 లక్షల ప్రైజ్ మనీతో ఒక్క టోర్నమెంట్ కూడా జరగలేదని, దీన్ని తామే నిర్వహించినట్లు తెలిపారు.
ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు మాట్లాడుతూ ‘‘ప్రస్తుత కమిటీ FNCC కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ టోర్నమెంట్స్ కాకుండా గతంలో కూడా వీరు చేసిన కార్యక్రమాలు FNCC కి మంచి పేరు వచ్చింది. ఈ కమిటీకి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ప్రత్యేకంగా చెప్పాలనుకున్న వ్యక్తి ముళ్లపూడి మోహన్ గారు. ఈ టోర్నమెంట్ కాకుండా గతంలో ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఎంతో యాక్టివ్ గా FNCC కి పేరు తెచ్చే విధంగా చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఎంత సక్సెస్ అవ్వడానికి కారణం ఆయనే. ప్రతి ఒక్క పనిని తన భుజాల పైన వేసుకుని ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందుండి నడిపించారు. మోహన్ ముళ్ళపూడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి టోర్నమెంట్స్ వల్ల ఎంతోమంది ప్లేయర్స్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లారు. ఈ కమిటీకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈవెంట్స్ ఎన్నో చేయాలని మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తున్నాను’’ అని అన్నారు.
నిర్మాత, FNCC సెక్రటరి ముళ్ళపుడి మోహన్, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ చాముండేశ్వరినాథ్, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, జాయింట్ సెక్రెటరీ బి. రాజశేఖర్ రెడ్డి, ట్రెజరర్ ఏడిద రాజా, సువెన్లైఫ్, హెచ్ఈఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు జాస్తి వెంకట్, కృష్ణంరాజు, కాజా సూర్యనారాయణ, మాజీ అధ్యక్షుడు కే.ఎస్రామారావు, బాలరాజు మరియు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు తదితరులు పాల్గొన్నారు.