స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మే మొదటి వారంలో కూడా వర్షాలు పడినప్పటికీ.. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భానుడి భగభగలతో అల్లాడుతున్నారు. గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటేశాయి. నేడు ఏపీలోని 73 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి, బాపట్ల, తూ.గో., ఏలూరు, గుంటూరు, కృష్ణా, పల్నాడు, కడప జిల్లాల్లో వడగాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అధికంగా గుంటూరులో 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యమైన పని ఉంటే తప్ప ఈ ప్రాంతంలోని ప్రజలు బయటికి రావొద్దని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఇక శనివారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లె మండలం చిన్నయ్యగూడెంలో 44.9 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6, బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు, ఏలూరు జిల్లా పెదవేగిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా 5 చోట్ల 44 డిగ్రీలు, 13 ప్రాంతాల్లో 43 డిగ్రీలు, 3 చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం 35 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.
ద్రోణి ప్రభావంతో మరో వైపు పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. అల్లూరి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశముందని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.