రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మెడికల్ కాలేజీలో అంకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ మెడికల్ కాలేజీలన్ని పేదల కోసమే. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండే. నాడు సీజేఐగా ఉన్న ఎన్వీ రమణతో సీఎం కేసీఆర్ దాదాపు 10 సార్లు స్వయంగా మాట్లాడారు. మా జర్నలిస్టుల సమస్యను పరిష్కరించండి అని మా ముఖ్యమంత్రే స్వయంగా, మన ముఖ్యమంత్రే స్వయంగా మాట్లాడారు. మీకు వేరే ముఖ్యమంత్రి లేరు. మీ పార్టీలో పది మంది ఉండొచ్చు.. కానీ బయట రాష్ట్రానికి ఒక్కరే ఉంటారు. మన అంటే నవ్వుతున్నందుకే మన ముఖ్యమంత్రి అని అంటున్న శ్రీధరన్నా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
ములుగులో సీతక్కకు కూడా మెడికల్ కాలేజీ వచ్చింది. అక్క కూడా ఏం చెప్పదు. పెద్దపల్లిలో మెడికల్ కాలేజీ వచ్చింది.. శ్రీధరన్న కూడా చెప్పడు అని కేటీఆర్ అన్నారు. వీళ్లు దాస్తే కూడా దాగని సత్యాలు ఇవి. ములుగు బాగా అభివృద్ధి చెందిందని మొన్న తాను పోయినప్పుడు స్థానికులు చెప్పారు. కలెక్టరేట్ వచ్చింది.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ వెలుగు వచ్చిందని చెప్పారు. సీతక్క వాళ్ల అమ్మనాన్నలకు కూడా పోడు భూముల పట్టాలు వచ్చాయి. ఇన్ని పనులు అవుతున్నాయి.. కానీ వారు థ్యాంక్స్ చెప్పరు. మాది సంస్కారం ఉన్న ప్రభుత్వం కాబట్టి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.