స్వతంత్ర వెబ్ డెస్క్: కొడంగల్లో(Kodangal) బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy). కొడంగల్ను దత్తత తీసుకుంటామని చెప్పి మంత్రి కేటీఆర్(Minister KTR) మోసం చేశారని ఆరోపించారు. కొడంగల్లో కట్టిన గుడి, బడి అన్నీ తాను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమేనన్నారు. కనీసం మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలను కూడా నిర్మించలేదన్నారు. నారాయణ్ పేట్ లిఫ్ట్ ఇరిగేషన్(Narayan Pate Lift Irrigation) పూర్తి చేయకుండా కొడంగల్ కి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని రేవంత్ తెలిపారు. మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఆరోపించారు. మీరు దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరంటూ రేవంత్ హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రతీ నెలా మొదటి తారీఖున రూ.4వేలు పెన్షన్ అందిస్తామని తెలిపారు. ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని వెల్లడించారు. కేసీఆర్ ఓడిపోతుండు కాబట్టే గజ్వేల్ నుంచి పారిపోతుండని విమర్శించారు రేవంత్. ఓటమి ఖాయమైంది కాబట్టే కేసీఆర్ ఆపద మొక్కులు మొక్కుతుండన్నారు. ఓటమి భయం కేసీఆర్ గొంతులో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.