కామారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్పై కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటిలో 27 మంది సభ్యులున్నారు. చైర్ పర్సన్ పై కాంగ్రెస్ పార్టీ ఆవిశ్వాసం పెడితే బీఆర్ఎస్కి చెందిన 8 మంది సభ్యులు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 36 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరముంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 27 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నుండి మరింత మందిని చేర్చుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ 23, కాంగ్రెస్ 12, బీజేపీ 8 స్థానాలను గెలుచుకోగా 6 మంది ఇండిపెండెంట్లు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. అయితే కాంగ్రెస్ నుంచి 8 మంది, బిజెపి నుంచి ఇద్దరు కౌన్సిలర్లు బిఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ బలం 39కి పెరిగింది. దీంతో బీఆర్ఎస్కు చెందిన నిట్టు జాహ్నవి చైర్ పర్సన్ గా, గడ్డం ఇందుప్రియ వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. అయితే చైర్ పర్సన్ తండ్రి బీఆర్ఎస్ నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు ఒంటెద్దు పోకడలతో ఆ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో చైర్ పర్సన్పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.