తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. లోక్సభ ఎన్నికలలో ద్రవిడ మున్నేట్ర కజగం సత్తా చాటింది. తమిళనాడు, పుదుచ్చేరిలో కలిపి మొత్తం 40 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. అయితే మొత్తం 40 సెగ్మెంట్లలో ఇండియా కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధించారు. తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉంది. ఈ పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు కేటాయించింది డీఎంకే. కాగా 22 సీట్లలో డీఎంకే విజయం సాధించింది. మిగతా సీట్లలో ఇండియా కూటమి మిత్రపక్షాలు గెలుపొందాయి. కాగా సుదీర్ఘకాలంపాటు తమిళనాడును పరిపాలించిన అన్నా డీఎంకే ఖాతానే తెరవలేదు. రెండాకుల గుర్తుతో 34 సీట్లలో పోటీ చేసింది అన్నా డీఎంకే. అయితే ఒక్క సీటులోనూ అన్నా డీఎంకే విజయం సాధించలేదు. అంతేకాదు పొత్తులో భాగంగా అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసిన డీఎండీకే కూడా పరాజయం పాలైంది.
అన్నాడీఎంకేతో పాటు అన్నామలై నాయకత్వంలోని తమిళనాడు బీజేపీ కూడా లోక్సభ ఎన్నికలలో బోణీ కొట్టలేదు. ఈసారి తమిళనాట కమలం పార్టీ సునామీ సృష్టించబోతోందని సోషల్ మీడియాలో హల్చల్ జరిగింది. తమిళనాడులో కనీసం నాలుగైదు లోక్సభ సీట్లు తమకు ఖాయమని ఎన్డీయే భావించింది. అయితే కమలం పార్టీ పూర్తిగా పరాజయం పాలైంది. కోయం బత్తూరు నుంచి పోటీ చేసిన తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై పరాజయం పాలయ్యారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కు ఎదురేలే కుండా పోయింది. ఇదిలాఉంటే చడీచప్పుడు లేకుండా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ హాట్టాపిక్ అయ్యారు.మళ్లీ పొలిటికల్ సీన్లోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడుకు నేనున్నా నంటూ భరోసా ఇచ్చారు. తన పని అయిపోలేదనీ, తనలో ఇంకా పోరాడే సత్తా ఉందని శశికళ చెబుతున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ పాలనను తీసుకొస్తానన్నారు. త్వరలో నే జనంలోకి వస్తానన్నారు. తమిళనాడు అంతటా విస్తృతంగా పర్యటి స్తానని మాట ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమికి నిరుత్సాహానికి గురికావాల్సిన అవసరం లేదం టూ అన్నా డీఎంకే క్యాడర్కు భరోసా ఇచ్చారు శశికళ.
వాస్తవానికి ప్రస్తుతం శశికళ అన్నా డీఎంకేలో లేరు. పార్టీ పరంగా ఆమెకు ఎటువంటి పదవీ లేదు. అయినప్పటికీ అన్నాడీఎంకేను రక్షించేది తాను మాత్రమే అంటూ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చారు శశికళ. ఈ సందర్భంగా స్టాలిన్ పాలనను ఆమె దుయ్యబట్టారు. స్టాలిన్ దుర్మార్గపు పాలన నుంచి తమిళనాడును కాపాడాలంటే అన్నాడీఎంకే మళ్లీ అధికారానికి రావాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు శశికళ. ఇదిలా ఉంటే ఇంత అకస్మాత్తుగా తమిళనాడులో జయలలిత పాలనను తాను తిరిగి తీసుకువస్తానని శశికళ చెప్పడం వెనుక బలీయమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరువాత పొలిటికల్ ఈక్వేషన్స్ టోటల్గా మారిపోయాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రాగా.. అన్నాడిఎంకే 64 స్థానాలకు పరిమితం అయ్యింది. అంతేకాదు జయలలిత మరణం తర్వాత శశికళ సారథ్యంలో పళని స్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే శశికళ జైలుకి వెళ్లాక రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. పళనిస్వామి ప్లేట్ ఫిరాయించారు. తనకు ముఖ్యమంత్రి పదవి రావడంలో కీలకపాత్ర పోషించిన శశికళను పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించారు. అంతేకాదు ఏకంగా అన్నా డీఎంకే నుంచే బయటకు పంపించివేశారు. ఆ తర్వాత పరిణామాల్లో పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాలుగా అన్నాడీఎంకే పార్టీ చీలిపోయింది.ఇదిలా ఉండగా శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం పార్టీని ఏర్పాటు చేశారు. అంటే అన్నాడీఎంకే ఓటు బ్యాంకు మూడుగా చీలిపోయింది. కొందరు అన్నాడీఎంకే మాజీ ఎంపీలు బీజేపీ గూటికి వెళ్లిపోవడంతో లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మరింతగా డ్యామేజ్ అయింది.
వాస్తవానికి తమిళనాడులో డీఎంకే సర్కార్పై వ్యతిరేకత ఉందన్న సంకేతాలు చాలాకాలం నుంచి అందుతున్నాయి. అయితే అన్నా డీఎంకే ఓటు బ్యాంకు మూడుగా చీలిపోయింది. దీంతో డీఎంకే కూటమికి అన్నివిధాల కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే మళ్ళీ అధికారంలోకి రావాలంటే మూడు ముక్కలైన పార్టీ అంతా ఏకతాటిపైకి రాక తప్పదు అంటున్నారు చిన్నమ్మ. కాగా చిన్నమ్మ వస్తానంటే అందుకు అన్నాడీఎంకేలో కూడా కీలక నేతలు సమ్మతిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. పళనిస్వామి అలాగే పన్నీర్ సెల్వం కూడా ఇందుకు సిద్ధం కావాలని అన్నాడీ ఎంకే క్యాడర్ కోరుతోంది. లేదంటే డీఎంకేని ఢీ కొట్టడం సాధ్యం కాదన్న వాదన బలంగా వినిపి స్తోంది.కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకుంది. తమిళిగ వెట్రి కళగం పేరుతో సినీ నటుడు విజయ్ దళపతి రాజకీయ పార్టీ పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విజయ్ అధికారికంగా ప్రకటించారు.తమిళిగ అంటే తమిళనాడు అని అర్థం. వెట్రి అంటే విజయమని అర్థం. అలాగే కళగం అంటే రాజకీయపార్టీ అని అర్థం వస్తుంది. టోటల్ గా తమిళిగ వెట్రి కళగం అంటే తమిళనాడు విజయం పార్టీ అనే అర్థం వస్తుంది. సినీ నటుడు విజయ్ దళపతి కూడా 2026 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని ప్రజల్లోకి రావడానికి సన్నద్దమవుతున్నారు. తమిళనాడులో విజయ దళపతికి మంచి స్టార్డమ్ ఉంది. ఇప్పటితరం హీరోలలో విజయ్ను ప్రముఖుడిగా చెబుతారు సినీ ప్రముఖులు. విజయ్ కేవలం సినిమాలకే పరిమితమైన నటుడు కాదు. కొంతకాలంగా సేవారంగంలోనూ ఆయన కొనసాగుతు న్నారు. పదో తరగతి, ప్లస్ టూ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే అన్నాడీఎంకేపై శశికళ నీడ కూడా పడకూడదని కోరుకునే సీనియర్ నేతలు ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు. ఒక్కసారి శశికళ చేతికి అన్నాడీఎంకే పగ్గాలు వెళితే ఇక తమ రాజకీయ భవితవ్యం డేంజర్ జోన్లో పడుతుందని వారందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శశికళ మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశించినా, అన్నాడీఎంకేను తన ఆధీనంలోకి తీసుకో వడం అంత సులభం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో శశికళ కూడా 2026 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని ప్రజల్లోకి రావడానికి ప్రణాళిక తయారు చేసుకుంటు న్నారు. అన్నా డీఎంకే పార్టీకి తాను తప్ప ప్రత్యామ్నాయం లేదన్న సంకేతాలు నాయకులు, కార్యకర్తలకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో శశికళ ప్రయత్నాలు ఏమేరకు సఫలం అవుతాయో చూడాల్సి ఉంది.