ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దూకుడు పెంచింది. ఘటనల వెనుక ఉన్నదెవరన్న దానిపై ఆరా తీసిన అధికారులు ప్రాథమిక నివేదికను రెడీ చేశారు. ఈ రిపోర్ట్ను ఇవాళ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ సమర్పించనున్నారు. అనంతరం ఈ నివేదిక ను సీఈసీకి చేర్చనున్నారు. ఇక ఈ నివేదిక ఆధారంగా నేతల విచారణలు, అరెస్ట్లు ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఎవరెవరిపై ఈసీ చర్యలు తీసుకోనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక ఏపీలో పోలింగ్ సందర్భంగా రాష్ట్రం రణరంగంగా మారింది. హింసాత్మక ఘటనలతో ఏపీ అట్టుడికిపోయింది. ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారకులెవరన్నదానిపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సిట్ టీం చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల బృందం.. అల్లర్లు జరిగిన అనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాలో పర్యటించింది. వీడియో ఫుటేజ్ అక్కడి స్థానికుల ద్వారా ఆరా తీసింది. ఇక తాడిపత్రిలో జరిగిన ఘటనపై ఇప్పటి వరకు 575 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే తిరుపతిలోని పద్మావతి యూనివర్శిటీని సైతం సిట్ సభ్యులు పరిశీలించారు. ధ్వంసమైన వాహనాల వివరాలు సేకరించిన అధికారులు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్ రూం సమీపం లోకి ఆయుధాలు రావడంపై పోలీసులను ప్రశ్నించారు. రామిరెడ్డి, కూచివారిపల్లెలోనూ పర్యటించిన సిట్ బృందం రాళ్ల దాడి జరిగిన టీడీపీ, వైసీపీకి సంబంధించిన నేతల ఇళ్లను పరిశీలించి వివరాలు సేకరిం చారు. ఇక మరోవైపు తాడిపత్రిలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అల్లర్ల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉంది.
ఇదిలా ఉంటే, హింసాత్మక ఘటనపై విచారణ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశారు కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. అయితే, ఈ బృందంపై విమ ర్శలు గుప్పిస్తున్నారు పలువురు ప్రతిపక్ష నేతలు. సిట్ టీమ్లో చాలామంది మాజీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తారని అనుమానిస్తున్న తెలుగు తమ్ముళ్లు దర్యాప్తు నిస్పక్షపాతంగా జరగదని విమర్శిస్తున్నారు.