Janasena | గల్ఫ్ దేశాలైన కువైట్, ఒమన్, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈలో స్థిర పడిన జన సైనికులు, వీర మహిళలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేస్తున్న సామాజిక సేవలు చాలా గొప్పవని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో స్థిర పడిన జన సైనికులు, వీర మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. గతంలో కరోనా ఉదృతి సందర్భంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేయడం, లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడిన పేద వారికి నిత్యావసర వస్తువులు అందించడం, “నా సేన కోసం నా వంతు”కు, జనసేన పార్టీ కార్యక్రమాలకు చేయూత తదితర సామాజిక కార్యక్రమాలకు అందించిన సహకారం అమూల్యమైనదని అన్నారు. కేసరి త్రిమూర్తులు, చందక రామదాసు, కంచర శ్రీకాంత్ తదితరుల నేతృత్వంలో దాదాపు 600 మందికి పైగా జన సైనికులు, వీర మహిళలు గల్ఫ్ దేశాల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని నాగబాబు పునరుద్ఘాటించారు.


