25.2 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

యుద్ధానికి దారితీసిన పాలస్తీనా, ఇజ్రాయెల్ వివాదం

    పాలస్తీనా -ఇజ్రాయెల్‌ వివాదం ఇప్పటిది కాదు. ఈ వివాదానికి దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. ఈ వివాదానికి పరిష్కారం కనుగొనడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే అమెరికాతోపాటు ఐక్యరాజ్యసమితి కూడా ఇజ్రాయెల్ తరఫున వకాల్తా పుచ్చుకోవడంతో వివాదం పరిష్కారం కాలేదంటు న్నారు చరిత్ర పరిశోధకులు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.

     పాలస్తీనా -ఇజ్రాయెల్‌ వివాదానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్  సామ్రాజ్యం ఓడిపోయిన తరువాత పాలస్తీనాగా అందరూ పిలిచే భూభాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది.అప్పటికి ప్రపంచ పటంపై ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. సహజంగా ఇజ్రాయెల్ నుంచి వెస్ట్ బ్యాంక్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలస్తీనా అని పిలిచేవారు. పాలస్తీనాలో మెజారిటీ ప్రజలు అరబ్బులు. అతి తక్కువ సంఖ్యలో యూదులు ఉండేవారు. పాలస్తీనాలో ఉన్న యూదులందరూ బయటి నుంచి వచ్చిన వారే అంటారు చరిత్రకారులు.కాలక్రమంలో పాలస్తీనాలో యూదుల సంఖ్య పెరిగింది. దీనికి ప్రధాన కారణం పాలస్తీనాకు వలసలు పెరగడమే. 1920,1940ల్లో ప్రపంచంలోని అనేక దేశాల్లోని యూదులపై దురాగతాలు పెరిగాయి. దీంతో ఎక్కడెక్కడి యూదులందరూ ఆయా దేశాల నుంచి పాలస్తీనాకు వలస వచ్చారు. వీరిలో యూరప్ నుంచి వచ్చిన యూదులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యూరప్ సహా అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చిన యూదులు, పాలస్తీనాను తమ పూర్వీకుల ఇల్లుగా భావిస్తుంటారు. అయితే యూదుల సంఖ్య ఎంతగా పెరిగినప్పటికీ , వారికి ఒక దేశమంటూ లేదు. దీంతో ఒక దేశమంటూ లేని యూదుల కోసం ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిని బ్రిటిష్ ఎత్తుగడ అంటారు చరిత్రకారులు. బ్రిటన్ ఎత్తుగడను పాలస్తీనా అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటన్ ఎత్తుగడే చివరకు పాలస్తీనా -ఇజ్రాయెల్ వివాదానికి నాంది పలికింది.

     ఏళ్లు గడిచేకొద్దీ, పాలస్తీనా -ఇజ్రాయెల్ వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో 1947లో ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. అరబ్బుల దేశంగా ఉన్న పాలస్తీనాను రెండుగా విభజించి, అందులో యూదులకు భాగం ఇవ్వడమే ఐక్యరాజ్యసమితి చేసిన ప్రతిపాదన. యూదులకు పవిత్రభూమిగా పేరున్న  జెరూసెలం, తన పర్యవేక్షణలో ఉంటుందని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది. అయితే తమ అస్థిత్వాన్ని దెబ్బతీసే పాలస్తీనా విభజనను అరబ్బులు వ్యతిరేకిం చారు. దీంతో ఐక్యరాజ్యసమితి ప్రతిపాదన అమలు కాలేదు. ఈ నేపథ్యంలో అరబ్బు భూభాగంలోనే ఉంటూ…. ఇజ్రాయెల్ పేరుతో ప్రపంచపటంపై లేని దేశాన్ని …ఉన్నట్లు యూదులు ప్రకటించారు. యూదుల ఈ నిర్ణయాన్ని మెజారిటీ పాలస్తీనియన్లు వ్యతిరేకించారు. ఇలా 1948 మే 14న ఇజ్రాయెల్ పేరుతో ఓ కొత్త దేశం సృష్టి జరిగింది. కొత్తదేశం సృష్టి, చివరకు ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య తొలి యుద్ధానికి దారి తీసింది. అధునాతన సాంకేతికతలో యూదులు ఘనాపాటిలు కావడంతో యుద్ధంలో వారిదే పైచేయి అయింది. దీంతో ఏడున్నర లక్షలమంది పాలస్తీనియన్లు ప్రాణాలరచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు పారిపోయారు. 1949లో యుద్ధం ముగిసేనాటికి పాలస్తీనాలోని అతిపెద్ద భూభాగాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. అరబ్బుల ఆధీనంలో ఉన్న పాలస్తీనా స్వల్ప భూభాగానికే పరిమితమైంది.

    తొలి యుద్దంలో జోర్డాన్ ఆధీనంలోకి వెళ్లిన పాలస్తీనా భూభాగానికి వెస్ట్ బ్యాంక్ అని పేరు పెట్టారు. అలాగే ఈజిప్టు ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతానికి గాజా స్ట్రిప్ అని పేరు పెట్టారు. జెరూసలెంను రెండుగా విభజించారు. జెరూసలెం పశ్చిమ వైపు భాగాన్ని ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు భాగాన్ని జోర్డాన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 1948 యుద్ధం తరువాత ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య చాలా కాలంపాటు ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే 60ల్లో మరోసారి విభేదాలు చెలరేగాయి. దీంతో 1967లో ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధం ప్రారంభమైంది. రెండోసారి జరిగిన యుద్ధంలో మరోసారి ఇజ్రాయెల్ విజేతగా నిలిచింది. తూర్పు జెరూసలెంతో పాటు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఇదిలాఉంటే, 2005లో గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగింది. అయితే కీలకమైన వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని నియంత్రిస్తూనే ఉంది. తూర్పు జెరూసెలంను తమ రాజధానిగా ఇజ్రాయెల్ పేర్కొంది. పాలస్తీనా – ఇజ్రాయెల్ వివాదం రక్తపుటేరులు పారించింది. ఇరువైపులా వేలాది మంది ఉసురు తీసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడుల నుంచి పాలస్తీనాను రక్షించుకోవడానికి 1987లో హమాస్ పేరుతో ఓ మిలిటెంట్ గ్రూపు ఏర్పటైంది. హమాస్‌ సంస్థను పాలస్తీనా మతపెద్ద షేక్ అహ్మద్ యాసిన్ ప్రారంభించారు. ఆ తరువాతికాలంలో పాలస్తీనా – ఇజ్రాయెల్ వివాదానికి చరమగీతం పాడాలని అమెరికా నిర్ణయించుకుంది. 2000లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ విషయంలో చొరవ చూపారు. శాంతి ప్రయత్నాల్లో భాగంగా అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఎహుద్ బరాక్, పాలస్తీనా పాలకుడు యాసర్ అరాఫత్ మధ్య సంధి కోసం బిల్ క్లింటన్ ప్రయత్నించారు. అయితే క్లింటన్ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి.

    తూర్పు జెరూసలెం, గాజా, వెస్ట్ బ్యాంక్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అనేకమంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు. వీరికి అక్కడి యూదులకు అనేక విషయాలపై వివాదాలు తలెత్తడం మొదలైంది. దీంతో ఈ ప్రాంతాల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేవి. గాజా ప్రాంతమైతే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆధీనంలో ఉండేది. ఇజ్రాయెల్ బలగాలతో అనేకసార్లు హమాస్ సంస్థ హోరాహోరీగా పోరాడింది. దీంతో గతంలో ఈజిప్ట్ నుంచి హమాస్‌కు ఆయుధాలు అందేవి. ఈ నేపథ్యంలో హమాస్‌కు ఆయుధాలు అందకుండా గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్‌ గట్టి నిఘా ఏర్పాట్లు చేసింది. దీంతో ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలు, పెడుతున్న ఆంక్షల వల్ల తాము అనేక విధాలుగా కష్టాలు పడుతున్నామని గాజా, వెస్ట్‌ బ్యాంక్ ప్రాంతాల్లోని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పాలస్తీనియన్ల గోడును పట్టించుకునే తీరిక, ఓపిక ఇజ్రాయెల్ పాలకులకు లేకుండా పోయాయి.దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య అనేక విషయాల్లో తరచూ గొడవలు వస్తున్నాయి. పాలస్తీనా శరణార్థుల సంగతి ఏమిటన్న ప్రశ్న తరచూ తెరమీదకు వస్తోంది. వెస్ట్‌ బ్యాంక్‌లో యూదుల నివాసాలను తొలగించాలా ? లేక కొనసాగించాలా ? ఇలా అనేక అంశాల్లో ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. కాగా ఇజ్రాయెల్ -పాలస్తీనా వివాదానికి పరిష్కారం కనుక్కోవడంలో భాగంగా అనేకసార్లు శాంతి చర్చలు జరిగాయి. అయితే చర్చలైతే జరిగాయి కానీ రెండు దేశాల మధ్య శాంతి నెలకొనలేదు. ఎప్పుడు చూసినా ఉద్రిక్త పరిస్థితులే ఉండేవి. ఈ నేపథ్యంలో కిందటేడాది అక్టోబరు ఏడో తేదీన హమాస్ బలగాలు ఇజ్రా యెల్‌పై దాడి చేశాయి. దీనికి ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేసింది. ఈ దాడులు చివరకు ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధానికి దారి తీసింది.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్