భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న IPC, CRPC, భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత , భారతీయ నాగరిక్ సురక్షా సంహిత , భారతీయ సాక్ష్య అధినియమ్ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు,SMS లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయవ్యవస్థలోకి వచ్చాయి.
కొత్త చట్టాలు పౌరులకు శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడానికి ప్రాధాన్యం ఇస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వలసవాద నేర న్యాయ చట్టాల ముగింపును సూచిస్తూ, అందరికీ న్యాయం చేయాలన్న తలంపుతో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. చట్టాలు కేవలం పేరు మార్పుకే పరిమితం కాదని, చట్టాల్లో పూర్తి సవరణలను తీసుకొచ్చామన్నారు. ఈ నూతన చట్టాలను పూర్తిగా భారతీయులే రూపొందించారని, దీని ఆత్మ, శరీరం పూర్తిగా భారతీయమేనని అన్నారు. ఈ కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని నిర్ధారిస్తాయని హోం మంత్రి తెలిపారు.
ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా కచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. వ్యవస్థీకృత నేరాల ను, ఉగ్రచర్యలను కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించారు. అయితే దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవశిక్ష పడనుంది. IPCలో కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి. ఏ నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది. వాటిని ప్రస్తుతం సరళతరం చేశారు. భారతీయ శిక్షా స్మృతి IPCలో 511 సెక్షన్లు ఉంటే భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్యను 358కి కుదించారు. ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచ నాలను ఒక సెక్షన్ కిందకు తెచ్చారు. 18 సెక్షన్లను ఇప్పటికే రద్దు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం, చిన్నారులపై సామూహిక అత్యాచారం, మూకదాడి తదితర నేరాలకు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు. దీంతో గందరగోళం ఏర్పడేది. భారతీయ న్యాయ సంహితలో ఆ లోటును పూడ్చారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు మరింత పకడ్బందీగా జరగడానికి వీలుగా తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలాన్ని సందర్శించడాన్ని తప్పనిసరి చేశారు.