ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించి, నెలరోజులపాటు కఠోర దీక్షబూనే రంజాన్ మాసం ప్రారంభ మైంది. సోమవారం రాత్రి ఆకాశంలో నెలవంకను దర్శించుకున్న ముస్లింలు.. ఇషా నమాజ్ అనంతరం ఖురాన్ను పఠించి రంజాన్ ఉపావాసాన్ని ప్రారంభించారు. ఇక రంజాన్ ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లో మసీదులు కొత్త శోభను సంతరించుకున్నాయి.
సోమవారం సాయంత్రం 6.40 నుంచి 6,52 గంటల వరకు నెలవంక దర్శనమివ్వడంతో దేశవ్యాప్తంగా ముస్లింలు ఉపవాస దీక్షను ప్రారంభించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో ఈ దీక్షను 30 రోజులపాటు కొనసాగిస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు ముట్ట కుండా.. కనీసం నోటిలోని లాలాజలాన్ని కూడా మింగకుండా భగవంతుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉంటారు. ఈ సందర్భంగా రోజులో సూర్యోదయానికి ముందు సహర్ నుంచి సూర్యస్తమయం ఇఫ్తార్ వరకు రోజూకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు. అలాగే నమాజ్ చేయడంతో పాటు రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల మధ్య కాలంలో తరావీహ్ నమాజులో ఖురాన్ చదువుతారు. ఈ నెల రోజుల్లో సఫిల్ చదివితే ఫరజ్ చదివినంత పుణ్యమని ఇస్లాం గ్రంధాన్ని నమ్మి ఆ విధంగానే తాము ప్రార్థనలు చేస్తుంటారు. రంజాన్లో చేపట్టే ఏహ్తేకాఫ్, జకాత్, ఫిత్రా, ఇఫ్తార్, తరావీహ్ నమాజ్తో ఏడాది అంతా శుభం కలుగుతుందని ముస్లింల విశ్వాసం.
రంజాన్ పండుగ వెనుక కూడా మానవాళికి మంచి చేసే ఉద్దేశం ఉంది. ఇది క్రమశిక్షణను, దాతృత్వాన్ని, ధార్మిక చింతనను ప్రజలకు బోధిస్తుంది. ముస్లింల మత గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని చెప్పుకుం టారు. అందుకే ఈ మాసం ముస్లింలకు అత్యంత పవిత్ర మాసం. ఇక రంజాన్ సందర్భంగా జకాత్కు అత్యంత ప్రాధాన్యతనిస్తారు ముస్లింలు. జకాత్ అంటే దానం చేయడం. పేదలకు, అనాథలకు, వృద్ధులకు ప్రతి ముస్లిం తనకున్న నికర ఆదాయంలో నూటికి రెండున్నర వంతున ఇవ్వాలని ఖురాన్ చెబుతోంది. దీంతో రంజాన్ మాసంలో దానం చేసి పుణ్యాన్ని మూటకట్టు కుంటారు.
రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ప్రత్యేకం. రోజంతా ఉపవాసం ఉండి, సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్షను విరమించేదాన్నే ఇఫ్తార్ అంటారు. ఇఫ్తార్ సందర్భంగా తాము తీసుకునే ఆహారాన్ని దీక్షా చేస్తున్న ఇతరులకు కూడా ఇవ్వడం పుణ్యంగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే 30 రోజులపాటు ఊరూ వాడలా ఇఫ్తార్ విందు సందడి నెలకొం టుంది. ప్రభుత్వాలు కూడా ఇఫ్తార్ విందును నిర్వహిస్తూ ముస్లిం ప్రజల పట్ల ఉన్న ప్రేమను.. రంజాన్ మాసపు భక్తిని చాటుతుంటారు ప్రజా ప్రతినిధులు. రంజాన్ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రత్యేకమైన వంటకం హలీం. ఈ నెల రోజులపాటు అన్ని ప్రాంతాల్లో హలీం కోసం ప్రత్యేకంగా హోటళ్లు ఏర్పాటు చేస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం హైదరాబాద్కే పరిమితం కాగా ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్ణణ కేంద్రాలకు విస్తరించడంతో నెయ్యి, డ్రైఫ్రూట్స్తో ఘుమ ఘుమలాడే హలీంని అందరూ లాగించేస్తున్నారు.