ప్రజా భవన్ను ప్రజా సమస్యల పరిష్కార భవన్గా ప్రజలు భావిస్తున్నారు. ఏళ్ల తరబడి తీరని తమ సమస్యలు ప్రజా భవన్కు వస్తే పరిష్కారమైపోతాయని విశ్వసిస్తున్నారు. ప్రజావాణిలో తమ వాణి వినిపించి వినతిపత్రాలు అందజేస్తున్నారు. దీర్ఘకాల సమస్యలతో సతమతం అవుతున్న బాధితులకు ప్రజా భవన్ ఏ విధమైన భరోసా కల్పిస్తోంది..? ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజా భవన్ అడుగులు వేస్తోందా…? వాస్తవానికి ప్రజా భవన్ కు వస్తున్న చాలా సమస్యలు కింది స్థాయిలోనే పరిష్కారం కావాల్సి వుంది. అయితే…అలా ఎందుకు జరగలేదు…?
భూ సమస్య, డబుల్ బెడ్ రూం సమస్య, పింఛన్లు, న్యూ రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్సఫర్లు….ఇలా అనేక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. బాధితుల పాలిట ప్రజా భవన్ వరప్రదాయినిలా మారిందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే, సమస్యలతో వస్తున్న ప్రజలకు ప్రజా భవన్ ఏ అభయం ఇస్తుంది. ఎలాంటి భరోసా కల్పిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజా భవన్ అడుగులు వేస్తోందా…లేదా అనే విషయంపైనే అందరూ దృష్టి సారించారు.
తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజా దర్బార్ ఆరంభమయ్యింది. అంతకు ముందు సీఎం అధికార నివాసంగా వున్న ప్రగతి భవన్ ను ప్రజా పాలన భవన్, ప్రజా భవన్ గా మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిని మహాత్మా జోతిబా పూలే ప్రజా భవన్ గా మార్చారు. తొలి రోజు జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని స్వయంగా వినతి పత్రాలు తీసుకున్నారు. తొలుత వరుసగా జరిగిన ప్రజావాణి, అనంతరం వారానికి రెండు రోజులకు మారింది. వారానికి రెండు రోజులు మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తానని ప్రజా భవన్ కార్యాలయం తెలియజేసింది. ప్రజా దర్బార్ నుంచి ప్రజా వాణిగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు దాదాపు 12 వేల అప్లికేషన్లు వచ్చాయి.
ప్రజా భవన్ కు ఇబ్బడి ముబ్బడిగా సమస్యల విన్నపాలు వస్తున్నాయి. అయితే, ఈ సమస్యలన్నీ కిందిస్థాయిలోనే పరిష్కారం కావాల్సి వుంది. తహశీల్దార్, మున్సిపల్ అధికారులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు…ఇలా గ్రామ, పట్టణ, జిల్లాస్థాయిలోనే సమస్యలు పరిష్కారం జరగాల్సి వుంది. అయితే, అలా జరగలేదు. అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. కొందరు అధికారుల నిర్లిప్త వైఖరి, నిర్లక్ష్య ధోరణి సైతం ఈ సమస్యలకు కారణం అయినట్టు తెలుస్తోంది. అయితే, గత సర్కారు అసమర్థ పాలన వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు మంత్రులు విమర్శిస్తున్నారు.
ప్రజా సమస్యలను ప్రజా భవన్ కార్యాలయం సంబంధితశాఖ అధికారులకు పంపిస్తోంది. తమ సమస్యపై ఫిర్యాదు చేసిన వారికి ప్రజా భవన్ నుంచి ఒక మెసేజ్ వెళుతోంది. త్వరలో మీ సమస్య పరిష్కారం అవుతుంది అని ఈ మెసేజ్ లో సారాంశం వుంటోంది. రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరు, ఉద్యోగాల ప్రమోషన్లు, బదిలీలు, సీఎం రిలీఫ్ ఫండ్ .. ఇలా పలు ప్రధాన సమస్యలపై పై వచ్చిన అర్జీలను సీఎంవో వద్దే ఉంచుకుంటున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉండే సమస్యల పై సీఎం నిర్ణయం తీసుకోవాల్సి వుంది. దీంతో, ఈ తరహా సమస్యల వివరాలను అధికారులు సీఎం కు చేరవేస్తున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం ఎంత మేరకు సఫలీకృతం అవుతుందో… ప్రజా సమస్యలన్నీ పరిష్కారానికి నోచుకుంటాయా…? ఇచ్చిన హామీలను నెరవేర్చి నూతన కాంగ్రెస్ సర్కారు ప్రజాభిమానం పొందుతుందా..? ప్రజల కళ్లల్లో వెలుగులు కన్పించి… ఆనందభాష్పాలతో… ప్రభుత్వాన్ని అభినందిస్తారా… ఇదంతా భవితే చెప్పాలి.