లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 2023 ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడంతో అప్పటి వరకు అండగా ఉన్న గులాబీ నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. తాజా ఖమ్మంలో కారు పూర్తిగా ఖాళీ అయిపోయింది. జిల్లాలో ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే కాస్త..కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఎన్నికల ముందు మంత్రి పొంగేలేటి చేసిన శపథం నెరవేర్చుకున్నట్లయింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ఖాళీ అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ పార్టీని వీడటంతో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే జారిపోయినట్లయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు మొదటి నుంచి అప్పటి నుంచి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసిఆర్ ను విశ్వసించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కొత్తగూడెం స్థానం నుంచి జలగం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖమ్మం స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే విజయం సాధించారు. ఇక గత చరిత్రను పునరావృతం చేస్తూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకైక స్థానం మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆయన కూడా తాజాగా కాంగ్రెస్లో చేరడంతో గులాబీ పార్టీ ఉమ్మడి జిల్లాలో కుప్పకూలినట్లయింది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో ఎనిమిది స్థానాలను కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో కైవసం చేసుకుంది. అలాగే పొత్తు నేపథ్యంలో సీపీఐకి కేటాయించిన కొత్తగూడెంలోనూ కాంగ్రెస్ కూటమి నెగ్గింది. దీంతో 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించినట్లయింది. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ ప్రముఖ వైద్యుడు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆయన విజయం సాధించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది.
తెల్లం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పరోక్షంగా ఆయన కాంగ్రెస్కు దగ్గరవుతూ బీఆర్ఎస్ను దూరం పెడ్తూ వచ్చారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దర్శనం కోసం వచ్చినప్పుడు ఐటీసీ గెస్ట్ హౌస్లో తెల్లం వెంకట్రావ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడే ఆయన కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు వినిపించాయి. కానీ ఆ ఊహాగానాలకు తెల్లం వెంకట్రావు ఖండించారు. బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఆతర్వాత మార్చి 1న మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ఎమ్మెల్యేలు వెళ్తుంటే తెల్లం డుమ్మా కొట్టారు. అంతేకాదు హైదరాబాద్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశానికి స్వయంగా కేటీఆర్ఆహ్వానించినా తెల్లం వెళ్లలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్రెడ్డిని కుటుంబ సమేతంగా వెంకట్రావు కలవడం హాట్ టాపిక్గా మారింది. ఇక ఇల్లెందులో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి వెంకట్రావు హాజరయ్యారు. క్యాంపు కార్యాలయానికి ఉన్న బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగిం చినప్పుడే ఆయన పార్టీ మారుతారని స్పష్టమైంది. తాజాగా తుక్కుగూడ సభలోనూ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఫైనల్గా ఆ తర్వాతి రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.


