ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లారు. ఉత్సాహంగా ఓటు వేశారు. బంధుమిత్రులతో రెండు రోజుల పాటు సంతోషంగా గడిపారు. తిరిగి హైదరాబాద్కు బయల్దేరారు. అంతలోనే వారిని టిప్పరు రూపంలో మృత్యువు కబళించింది. గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులను తీవ్ర గాయాలపాలు జేసింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటిన వేళ స్థానికులు అప్రమత్తమై.. 108, పోలీసులకు సమాచా రమిచ్చారు.
బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి.. హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైన వారే. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్కు మంటలు రేగి.. ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి.
ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. మరో ఐదుగురు ఆహుతి అయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా.. చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి.. 108 వాహనాల్లో 20 మంది క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. చిలక లూరిపేట నుంచి ఫైరించన్ వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ వర్క్ జరుగుతుండటం.. తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం.. టిప్పర్ వేగంగా దూసుకు రావడం.. టిప్పర్ డ్రైవర్ వేగాన్ని నియంత్రించ లేకపోవడం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.


