పార్లమెంట్ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం నివురుగప్పిన నిప్పులా మారింది. 2022 బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి..రాష్ట్రంలోని మేదినీపూర్ జిల్లా భూపతినగర్లో నిందితులను ఎన్ఐఏ బృందం అరెస్ట్ చేసింది. ఈనేపథ్యంలోనే వారిపై ఎన్ఐఏ బృందం దాడి చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం చట్టబద్ధత కంటే రాజకీయం గా ఉండడంతో ఈ చర్య బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల అంశంగా మారింది.
ఎన్ఐఏ దాడి అంశాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈనేపథ్యంలోనే NIA అధికారులపై ఆ రాష్ట్ర పోలీసులు వేధింపులు, అతిక్రమణలపై కేసు నమోదు చేశారు. ఈ పంచాయతీ కాస్త రాజకీయ ఉద్రిక్తతల మధ్య రాష్ట్రం, కేంద్రం మధ్య వివాదంగా మారింది. ఎన్నికలు సమీపిస్తుం డడంతో భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు పెరుగు తోంది.అంతకు ముందు ఒక పేలుడు కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తుండగా…పుర్బా మేదినీపూర్ జిల్లాలోని భూపతినగర్ వద్ద NIA బృందంపై గుంపు దాడి జరిగింది. ఈ సంఘటన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ ఆదేశాల మేరకే జరిగిందని బీజేపీ పేర్కొంది. రాజకీయ పరపతి కోసం కేంద్రం ఫెడరల్ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్న సమయంలో తృణమూల్ ఎన్నికల నిర్వాహకులను అరెస్టు చేయడానికి ఫెడరల్ ఏజెన్సీని బీజేపీ ఉపయోగించుకుంటోందని టీఎంసీ పార్టీ నేతలు బీజేపీపై ఫైర్ అయ్యారు. ఇది పెద్ద కుట్రలో భాగమని మండిపడ్డారు. ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా టీఎంసీ కిందిస్థాయి కార్యకర్తల్లో భయాందోళనలు సృష్టిం చేందుకు ఈ దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. టీఎంసీ నేత తివారీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సమర్థించారు. ఏ పౌరుడైనా NIA అధికారిని ఏ సమయంలోనైనా కలుసుకోవచ్చన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల గురించి సమాచారాన్ని పంచుకోవచ్చన్నారు. TMC నాయకులు NIA అధికారులను కలవాలనుకుంటే తాను అపాయింట్ మెంట్ ఏర్పాటు చేయగలన్నారు. టీఎంసీని ఓడించేందుకు బీజేపీకి ఎన్ఐఏ సాయం అవసరం లేద న్నారు.


