రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. గతంలో వైసీపీ పాలనలో జరిగిన నాడు-నేడు పనులపై సభ్యులు.. మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించారు. వైసీపీ హయాంలో నాడు-నేడు పనుల్లోని అవకతవకలపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే శ్రావణ్ కోరారు. పనులు చేయకుండానే బిల్లులు తీసేసుకున్నారని.. నాడు-నేడు పనుల పేరుతో ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని ధూళిపాళ్లి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత నారా లోకేష్ మాట్లాడుతూ.. తొలి ఏడాదిలో కేజీ-పీజీ వ్యవస్థను ప్రక్షాళన చేపడతామని స్పష్టం చేశారు. నాడు-నేడు పనులపై విచారణ ఏ విధంగా చేపడతారో సభలో ప్రకటించాలని స్పీకర్ అయ్యన్న కోరగా.. సభ్యులు లేవనెత్తిన అంశాలపై విచారణ చేపట్టి.. సభలో నివేదిక పెడతామని నారా లోకేష్ వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు, హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చేలా సవరణకు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తేలిపింది.
గ్రూపు 1 పోస్టుల భర్తీ విషయంలో రూ.300 కోట్లు అవినీతి జరిగిందని.. ఏపీపీఎస్సీ అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల అన్నారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, పీఎస్సార్ ఆంజనేయులుతో పాటు పలువురు వైసీపీ నేతలు ఏపీపీఎస్సీలో ఉండి అక్రమాలకు సహకరించారని దూళిపాళ్ల ఆరోపించారు. ఈ విషయంపై అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ లో అక్రమాలు జరిగింది నిజమేనని.. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ మూల్యాంకనం చేశారని చెప్పారు. దీనిపై అభ్యర్థులు కోర్టుకు కూడా వెళ్లారన్నారు. గ్రూపు 1 అక్రమాల పై ప్రభుత్వం కూడా విచారణ కమిటి వేసిందన్నారు. ఆగస్ట్ 31 లోగా నివేదిక వస్తుందని.. ఆ తర్వాత సభ్యుల కోరిన విధంగా సీబీఐ విచారణపై పరిశీలిస్తామని మంత్రి పయ్యావుల తెలిపారు.
ఏపీ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఎమ్మెల్యే గౌతు శిరీష ఆ తీర్మానాన్ని బలపరిచారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి వర్గం ఇబ్బందులు పడిందని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఎమ్యెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. సన్ రైజ్ బ్రాండ్ ఇమేజ్ ను.. మన రాష్ట్రానికి చంద్రబాబు తీసుకువచ్చారన్నారు. ఆ తర్వాత జగన్ అసమర్థ పాలనను జనం చూశారని..చెత్తపై పన్ను వేసిన చెత్త పాలనను జనం చూశారని తీవ్రంగా విమర్శించారు. జగన్ పాలన అనేక మంది హత్యకు కారణమైందన్న ఆమె.. ఇప్పుడు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వైసీపీ ఎలా మాట్లాడుతుందని గౌతు శిరీషా ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనతో.. 93 శాతం సీట్లు ఎన్డీఏ కూటమి సాధించడానికి కారణమైందని బీజేపీ ఎమ్యెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. అమరావతి దుస్థితికి జగన్ పాలనే కారణమని సుజనా ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ మీదే ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, ఎన్జీవోలను అనుసంధానం చేసుకొని రాష్టాన్ని అభివృద్ధిలోకి తీసుకు రావాలని సుజనా చౌదరి కోరారు.
సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందన్నారు. గత వైసీపీ అధ్వాన్న పాలన వల్ల ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేని పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుతం బడ్జెట్ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు. ఆర్థిక గందరగోళ పరిస్థితులు చక్కదిద్ది మరో రెండు నెలల తర్వాత బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి ఉందన్నారు. పవన్ కల్యాణ్ క్లిష్ట సమయంలో కీలకంగా వ్యవహరించారంటూ జనసేనానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. రాష్ట్రం కోసం టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ అని.. ఓట్లు చీలకూడదు.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని పవన్ సామాజిక బాధ్యతతో ఆలోచించారనన్నారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సమైక్యంగా పని చేస్తామని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ప్రజల తరపున సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ను సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నానని.. కేంద్ర బడ్జెట్ తో.. ఏపీ మళ్లీ గాడిలో పడుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఏపీకి నిధులు కేటాయించినందుకు ఏపీ డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించినందుకు.. కూటమి తరఫున పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజలకు మేలు చేసేలా.. కేంద్ర బడ్జెట్ ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.


