స్వతంత్ర, వెబ్ డెస్క్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై, కొట్లాడితే వచ్చింది “తెలంగాణ” అని పేర్కొన్నారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. అమరవీరుల త్యాగ ఫలితం, సబ్బండ వర్గాల పోరాట ఫలితం “తెలంగాణ” అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్న వేళ.. దొరల పాలన మళ్లీ వచ్చిన యాళ్ల, ప్రతిపక్షాలు అమ్ముడుపోయిన సమయంలో పుట్టిందే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని తెలిపారు.
వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వైఎస్ షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వయంగా తన చేతితో సకినాలు, డబల్ కా మీటాను చేశారు. అనంతరం అక్కడున్న కార్యకర్తలకు పిండివంటకాలు పంపిణీ చేశారు. 3 కోట్ల మంది పోరాటం, అమరవీరుల త్యాగ ఫలితం “మన తెలంగాణ” అని.. సాంస్కృతిక వారసత్వం, విభిన్న సంస్కృతి తెలంగాణ సొంతం అని కొనియాడారు. జయశంకర్ సార్ ఆశయాల సాధన కోసం.. ఉద్యమ ఆకాంక్షల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కట్టుబడి పని చేస్తుందన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు షర్మిల.
“నియామకాల కోసం మొట్టమొదటగా పోరాటం చేసి.. గెలిచి, నిలిచింది వైఎస్ఆర్టీపీ. అన్నం మెతుకులు ముట్టకుండా నిరుద్యోగ దీక్షలతో సర్కారు మెడలు వంచి నోటిఫికేషన్లు ఇప్పించింది. కాంట్రాక్టు కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాల నిలబడింది. నిధులు పక్కదారి పడుతుంటే, తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయితే ప్రశ్నించే గొంతుకగా నిలిచింది. రాష్ట్రాన్ని 5లక్షల కోట్ల అప్పులకుప్ప చేస్తే ఎదురు నిలిచి, ప్రశ్నించింది. అక్రమ అరెస్టులతో, పోలీసు లాఠీలతో, అక్రమ నిర్బంధాలతో హింసించినా.. మొక్కవోని దీక్షతో పోరాటం చేసింది. నీటి వాటాల్లో అన్యాయం జరిగితే, కాళేశ్వరంతో వేల కోట్లు దోచుకుంటే.. నిస్వార్థంగా ఉద్యమించింది. 3800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి, కేసీఆర్ ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ఎండగట్టింది.” – వై.ఎస్. షర్మిల