ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తి వేస్తామని కేంద్ర హెమ్ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపింది. దీంతో నిన్న మొన్నటివరకు దూకుడు మీదున్న టీడీపీ కూటమి అకస్మాత్తుగా డిఫెన్స్లో పడింది. బీజేపీ నాయకుల ప్రకటనతో తెలుగుదేశం పార్టీ కూటమి ఆత్మ రక్షణలో పడింది. భారీ సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీలు తమకు నూటికి నూరు శాతం దూరమవుతారని తెలుగుదేశం పార్టీ కూటమి భయాందోళనలు వ్యక్తం చేసింది.
రిజర్వేషన్ల రగడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తోంది. తాము ఈసారి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి తీరతామని ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసిన తరువాత వాటిని బడుగు, బలహీనవర్గాల కోటాలో పెడతామన్నారు అమిత్ షా. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ముస్లిం మైనారిటీల దుర్బర జీవితాలను నిశితంగా పరిశీలించారు. దీంతో ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపడానికి నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేనతో భారతీయ జనతా పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పింది. అంతేకాదు….తమ మేనిఫెస్టోలో కూడా ముస్లింల రిజర్వేషన్ రద్దు అంశాన్ని బీజేపీ చేర్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. మొత్తానికి సీన్ కట్ చేస్తే… ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ కట్టుబడి ఉందని తెగేసి చెప్పారు పీయూష్ గోయల్. చంద్రబాబు నాయుడుతో భేటీ తరువాత ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి పీయూష్ గోయాల్ ఘాటు కామెంట్స్ చేశారు. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముస్లిం రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశమైంది. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ కుండబద్దలు కొడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా ఖండించలేదు. పొత్తు ధర్మం కాబట్టి బీజేపీ విధానాలను చంద్రబాబు ఖండించలేదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో నెలకొంది. వాస్తవానికి రాయలసీమలో ముస్లిం మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కర్నూలు, నంద్యాల, కడప, రాయచోటి, కదిరి లాంటి అనేక ప్రాంతాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగల స్థాయిలో ముస్లిం మైనారిటీలున్నారు.రాయలసీమే కాదు…కోస్తా జిల్లాల్లో కూడా ముస్లిం మైనారిటీలు భారీ సంఖ్యలో ఉన్నారు. గుంటూరు తూర్పు, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావు పేట, చిలకలూరిపేట, విజయవాడ పశ్చిమ , బందరు, పెడన వంటి అనేక ప్రాంతాల్లో కూడా ముస్లిం మైనారిటీలు అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు.
రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ తెగేసి చెబుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఖండించకపోవడాన్ని ముస్లిం మైనారిటీలు నిశితంగా గమనిస్తున్నారు. తమ వర్గ ప్రయోజనాలకు భిన్నంగా కమలం పార్టీ ప్రవర్తిస్తున్నప్పటికీ చంద్రబాబు నోరు తెరవకపోవడం ముస్లింలకు మింగుడు పడటం లేదు. చంద్రబాబు నాయుడు తమకు మంచి చేయకపోయినా పర్వాలేదంటున్నారు ముస్లింలు. అయితే తమకు ద్రోహం చేసేలా బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్న ప్పటికీ చంద్రబాబు ఎందుకు ఖండించడం లేదని మండిపడు తున్నారు ముస్లింలు. కాగా ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల రచ్చ రోజురోజుకూ ముదురుతోంది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్ల రద్దు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ముస్లింవర్గాలు ఎన్నికల నాటికి యూ టర్న్ తీసుకుంటారని టీడీపీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ తమకు కలిసి వస్తుందన్న ఉద్దేశంతోనే చివరిక్షణంలో బీజేపీతో తెలుగుదేశం, జనసేన ఎన్నికల పొత్తు పెట్టుకు న్నాయి. అయితే బీజేపీతో పొత్తు లక్ష్యం నెరవేరలేదని టీడీపీ, జనసేన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయవర్గాల సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా జనసేన గుర్తు గాజుగ్లాసు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించిన వైనాన్ని టీడీపీ నేతలు ఉదాహరిస్తున్నాయి.గాజు గ్లాసును ఫ్రీ సింబల్గా ఉంచి….దానిని ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని తప్పు పడుతున్నారు. కీలకమైన గుర్తుల విషయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం సహకరిం చకపోతే, ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రయోజనం ఏమిటని టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు.


