శిరోజాల స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో త్వరలోనే కేసుకు సంబంధించిన ట్రయల్స్ మొద లు కానున్నాయి.
ఈజీ మనీ కోసం ఓ నిందితుడు కొత్త పుంతలు తొక్కాడు. మిజోరం రాష్ట్రానికి చెందిన లుకాస్ తంగ్మంగ్ లియానా, నేలా ఫ్యామిలీ ఎక్స్పోర్ట్స్ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థను నెలకొల్పాడు. 16 మంది తో కలిసి అక్రమార్కపర్వానికి తెరలేపాడు. ఇంతకీ ఈ ఘనుడు చేసే మా గొప్ప వ్యాపారం ఏమి టంటే వెంట్రుకల స్మగ్లింగ్. అక్రమార్క పర్వాల్లో దిట్టగా లుకాస్ తంగ్మంగ్ పేరు పొందాడు. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వెంట్రుకలను విమానాలు, రోడ్డు మార్గాల్లో లుకాస్ తెప్పించుకునేవాడు. మిజోరం సరిహద్దుల వద్ద దొంగ దారుల ద్వారా ఆ శిరోజాలను మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం, చైనా దేశాలకు చేరవేసే వాడు. మయన్మార్ దేశస్థుల ద్వారా తమలపాకులను మన దేశానికి అక్రమ మార్గంలో తీసుకువచ్చేవాడు. ఈ వ్యవహారాలకు సంబంధించిన చెల్లింపులను హవాలా మార్గంలో జరిపేవాడు. ఈ మేరకు పక్కాగా సమాచారం సేకరించిన ఈడీ అధికారులు నేలా ఫ్యామిలీ ఎక్స్పోర్ట్స్ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కేసులు నమోదు చేశారు.
ఈడీ అధికారులు విచారణలో భాగంగా మిజోరంతో పాటు హైదరాబాద్లోని వేర్వేరు చోట్ల తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో లుకాస్ పలు షెల్ సంస్థలను ఏర్పాటు చేసి ఈ నిర్వాకం సాగిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. లుకాస్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న కోటీ 21 లక్షల రూపాయలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లుకాస్తోపాటు అతని అనుచరులకు సంబంధించిన దాదాపు వంద అకౌంట్లపై దృష్టి సారించారు. వివిధ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న ఏడు కోట్ల 85 లక్షల రూపాయల నగదును ఫ్రీజ్ చేశారు. కేసు దర్యాప్తు పూర్తి చేసి నాంపల్లి ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. తాజాగా దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న శిరోజాల స్మగ్లింగ్ పై దృష్టి సారించిన ఈడీ..ఇందుకు సంబంధించిన మూలాలను లోతుగా విచారించి వివరాలు రాబడుతోంది.


