దేశంలో విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే సుమోటోగా కేసులు పెట్టాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. కేసులు నమోదు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ద్వేషపూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
దేశాభివృద్ధితో పాటు ప్రజాస్వామ్యానికి విద్వేష ప్రసంగాలు అడ్డుకట్టుగా నిలుస్తున్నాయని తెలిపింది. విద్వేషత ప్రసంగాల కేసులను సుమోటోగా స్వీకరించాలని 2022 అక్టోబర్ లో తాము జారీ చేసిన ఉత్తర్వులను ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలే అమలు చేస్తున్నాయని, ఇతర రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని మండిపడింది.