ఆ పేరు వినపడద్దు. కనపడద్దు అనేలా తెలంగాణ సర్కార్ పటిష్ట బందోబస్తు చేపడుతున్నా సరే రాష్ట్రం లో గంజాయి చొరబడుతూనే ఉంది. తాజాగా పుష్ప సినిమా తరహాలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి స్మగ్లింగ్ పనసపళ్ళ చాటున తరలిస్తున్న ముఠాని పోలీసులు మాటు వేసి మరీ అరెస్ట్తో వేటు వేశారు. గంజాయి అక్రమ రవాణాకి సంబంధించి రకరకాల దారులు వెతుక్కుంటున్నారు నిందితులు. తాజాగా పనసపళ్ల మధ్యలో గంజాయిని పెట్టి తరలిస్తుండగా శామీర్ పేట్ పోలీసులు పట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఎవరికీ అనుమానం రాకుండా పనసపళ్లు మధ్య గంజాయిని అమర్చి నిందితులు తరలిస్తున్నట్లు పక్కా సమాచారంతో శామీర్పేట్, మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకు న్నారు. అక్రమంగా తరలిస్తున్న 33 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
రాజమండ్రి నుంచి తెలంగాణాలోని కరీంనగర్ వైపు ఓ బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుండి కరీంనగర్, హైదరా బాద్ రాజీవ్ రహదారిలో మేడ్చల్ ఎస్వోటీ, మేడ్చల్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈనేపథ్యం లోనే వారు బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పనసపళ్ళ లోడుతో గంజాయిని తరలిస్తున్నారని గుర్తించారు. అంతే కాకుండా గంజాయిని తరలిస్తున్న ఈ బొలెరో వాహనాన్ని మరో కారు ఫాలో అవుతూ ఉండటం పోలీసులు గుర్తించారు. 35 కిలోల పైచిలుకు గంజాయిని స్వాధీనం చేసుకొని, నలుగురిలో ముగ్గురిని అరెస్టు చేయగా, ఒకరు పారిపోయారు. A1 సతీష్, A2 సాయి, A3 శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పారిపోయిన శివ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ఎనిమిది లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేశారు.