నటుడు, సూద్ ఛారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్ను ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. ఆరోగ్యం-సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించే సూద్ చారిటీ ఫౌండేషన్… రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. సోనూ సూద్ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి.. అంబులెన్స్లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం చంద్రబాబు అంబులెన్స్లను ప్రారంభించారు.
అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు, సుదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా అంబులెన్సులు ఇచ్చిన సోనూసూద్ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసర వైద్య చికిత్సలు, అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందేలా ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఆశయంలో సూద్ ఛారిటీ ఫౌండేషన్ భాగస్వామి కావడంపై ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తాము అందించిన అంబులెన్సులతో ఆపదలో ఉన్నవారికి భరోసా లభిస్తుందని సోనూసూద్ ఆశాభావం వ్యక్తం చేశారు.