33 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

ఉచితాలు కొనసాగాల్సిందేనా !

    ఉచితాల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలకు వ్యతిరేకంగా కొంతకాలంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో రాజకీయపార్టీలు ఉచిత పథకాలపై ఇచ్చే హామీలను నియంత్రిం చాలంటూ కొంతమంది న్యాయస్థానాల గడప కూడా తొక్కారు. పన్నుల రూపాల్లో ప్రజలు కట్టిన సొమ్మును ఉచితాల పేరుతో పంచి పెడుతున్నారన్న వాదన వ్యతిరేకవర్గం నుంచి వినిపిస్తోంది. అయితే ఉచితాలు కొనసాగించాల్సిందేనన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. సమాజంలో పేదవర్గాలకు బతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం కావాలి. సంపద సృష్టించడం ముఖ్యమే కావచ్చు. దీనికోసం రకరకాల మార్గాలున్నాయి. అయితే ఉన్న సంపదలో పేదవర్గాలకు కాస్తంత వాటా ఇవ్వాల్సిందేనంటున్నారు జనం పక్షాన నిలబడే ఆర్థిక వేత్తలు.పరిమితికి మించకుండా కొంతమేర ఉచితాలు ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

   ఇటీవలికాలంలో దాదాపుగా అన్ని పార్టీలు ఉచితమంత్రం జపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను తాయిలాల సంస్కృతిగా వ్యతిరేకులు పేర్కొంటున్నారు.తాయిలాల సంస్కృతి దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్న విమర్శలు వస్తున్నాయి. సంక్షేమం పేరుతో అడ్డూ అదుపు లేకుండా ఉచిత పథకాలు అమలు చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదన్న వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఉచితాలతో రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారుతున్నాయంటున్నారు కార్పొరేట్‌ సంస్కృతిని బలపరిచే ఆర్థిక వేత్తలు. వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజల నుంచి సేకరించిన సొమ్ములను రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం పందారం చేయడం ఎంతవరకు సమంజసమని వీరు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మనదేశంలో ఉచిత పథకాలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు. కొన్ని దశాబ్దాల నుంచి ఉచిత పథకాలు అమలవుతున్నాయి.

ఉచిత పథకాలు అనగానే వెంటనే గుర్తుకువచ్చేది తమిళనాడు రాష్ట్రమే. తమిళనాడు ఉచిత పథకాలకు పెట్టింది పేరు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎమ్జీ రామచంద్రన్‌ను ఉచితాలకు ఆద్యుడిగా చెప్పవచ్చు. ఎమ్జీ రామ చంద్రన్ తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఉచితాలను ప్రారంభించారు. ఎమ్జీ రామచంద్రన్ ఉచితాలు ప్రారంభించడం వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవు. 70ల్లో తమిళనాట పేదరికం బాగా ఉండేది. దీంతో చాలా మంది తమ పిల్లలను పాఠశాలలకు పంపేవారు కాదు. మూడు పూటలా తిండి సంపాదించు కోవడానికే పేదలు నానా ఇబ్బందులు పడేవారు. దీంతో చిన్నారులను బడులు మానిపించేవారు. సంపాదన కోసం కార్ఖానాలకు పంపేవారు. నిరుపేదల ఈ దయనీయ స్థితిని చూసి ఎమ్జీ రామచంద్రన్ చలించిపోయారు. అప్పటికప్పు డు పేదలను ఆదుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలల పిల్లలకు మధ్యాహ్న భోజనం అనే వినూత్న పథకాన్ని ఎమ్జీఆర్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పాఠశాలలకు వెళ్లే పిల్లలకు మధ్యాహ్నం పూట తిండి పెట్టే భారాన్ని తల్లిదండ్రులపై లేకుండా చేశారు ఎమ్జీ రామచంద్రన్‌.

ఆర్థికశాస్త్రంలో సంపద సృష్టి, సంపద పంపిణీ మధ్య నిరంతర చర్చ జరుగుతూనే ఉంది. ఇరవయ్యవ శతాబ్దం తొలిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వలస పాలన వ్యతిరేక స్వాతంత్ర్య ఉద్యమాలు పెల్లుబికి ముందుకు వచ్చాయి. ఈ ఉద్యమాలు అన్ని దేశాల్లోనూ సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ప్రజల మద్దతు సమీక రించాయి. ఏ దేశ స్వాతంత్ర్య ఉద్యమం కూడా తాము పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మిస్తాం అని కనీసం మాట వరసకు కూడా అనలేదు. ఇక్కడో విషయం ప్రస్తావించుకుని తీరాలి. 1971–72 ప్రాంతంలో పేదరిక నిర్మూలన గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఇందిరా గాంధీ ఓ రోజు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. అప్పుడు సంపద పెరగకుండా సంక్షేమాన్ని ఎలా సాధిస్తారని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు చెందిన ఓ ప్రముఖుడు ఇందిరా గాంధీని ప్రశ్నించారు. దీనికి ఇందిర జవాబు చెబుతూ ఉచితాలను బలపరిచారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కొన్ని దశాబ్దాల పాటు తమ జీవితాలు మారతాయని ప్రజలు ఆశించారని ఆమె చెప్పారు. అయితే అనేకానేక కారణాలతో ప్రజల బతుకుల్లో వెలుగులు రాలేదన్న వాస్తవాన్ని ఇందిర అంగీకరించారు.

ఈ నేపథ్యంలో పేదల బతుకులు బాగు చేయడం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. ఉన్న సంపదలోనే పేదలకు కొంత వాటా ఇవ్వడం తప్పనిసరి అంటూ ఉచితాలను ఇందిరా గాంధీ అప్పట్లోనే బలపరిచారు. ఏమైనా కాలే కడుపునకు పట్టెడన్నం పెట్టడమే ప్రభుత్వాల విధి కావాలి. సంక్షేమం పేరుతో కొంత వరకు ఉచితాలను ప్రకటించినా, వాటిని స్వాగతించాల్సిందే. సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం కావాలి. ప్రభుత్వరంగ బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసి ఎంచక్కా విదేశాల్లో విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తున్న కార్పొరేట్ దిగ్గజాల గురించి పల్లెత్తు మాట అనని ఆర్థికవేత్తలు పేదవారి కోసం అమలు చేస్తున్న ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడటమే విడ్డూరం. ఏమైనా సమాజంలోని మెజారిటీ ప్రజలు కోరుకునేది సంక్షేమ రాజ్యమే. సంక్షేమమే పాలకు లకు తారకమంత్రం కావాలంటున్నారు ప్రజల పక్షాన నిలబడే ఆర్థిక వేత్తలు. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను తాయిలాల సంస్కృతిగా పేర్కొనడం కూడా సమంజసం కాదు. ఇది ఉచితాల వల్ల ప్రయోజనం పొందే పేదలను అవమానించడమే. పేదల బతుకుల్లో వెలుగుల్లో నింపడానికి అప్పట్లో ఇందిర చెప్పినట్లు ఉన్న సంపదలో కొంత వాటా ఇవ్వాల్సిందే. పేదల కోసం ఉచితాలను స్వాగతించాల్సిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్