తెలుగు రాష్ట్రాల రైల్వే బడ్జెట్లను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తెలంగాణకు రూ. 5,337 కోట్లను కేటాయించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు రికార్డు స్థాయిలో రూ.9,417 కోట్లను కేటాయించారు. తెలుగు రాష్ట్రాలకు స్వల్పంగా రైల్వే బడ్జెట్ పెరిగింది. తెలంగాణలో ఇప్పటివరకు రైల్వే అభివృద్ధి కోసం 41,674 కోట్ల పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధి కోసం 84,559 కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని, కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యం అవుతోందన్నారు.
ముఖ్యమైన రైల్వే స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో 1,026 కి.మీ.మేరకు కవచ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2026లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ నుంచి ప్రస్తుతం ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని… రాష్ట్రంలోని అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని చెప్పారు. పేద వర్గాల కోసం నమో భారత్ రైళ్లను నడుపుతున్నామన్న అశ్విని వైష్ణవ్.. త్వరలో దేశమంతా దాదాపు 100 నమో భారత్ ఎక్స్ప్రెస్లు తీసుకురానున్నామని… ఈ రైళ్ల ద్వారా పేద ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందనున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.