నేటి నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు, అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తాయని చెప్పారు. జులై 18 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయన్నారు. 13 జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఈ 13 జిల్లాలు కాక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వర్షాలకు తోడు భారీ స్థాయిలో ఈదురు గాలులు వీస్తాయని వివరించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులకు తోడు పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడని సూచించారు. హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.


