33 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

ముడిపడని ఏపీ రాజధాని రగడ

     అధికార పక్షమేమో మూడు రాజధానులంటుంది. విపక్షం అమరావతే కేపిటల్‌ అని ఘంటా పథంగా చెబుతుంది. మధ్యలో కొందరు వైసీపీ నేతలు మాత్రం మరికొంత కాలంపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని అంటారు. ఎన్నికల వేళ ఎందుకీ గందరగోళ పరిస్థితులు ? రాజకీయ నేతలు ఇలాంటి వాటిని కావాలనే సృష్టిస్తున్నారా లేదంటే మరేదైనా కారణం దాగుందా ? అసలేంటి పరిస్థితి ?

     ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అన్న విషయంపై వైసీపీ వచ్చినప్పటి నుంచీ గందరగోళం నెలకొందా అంటే అవుననే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను తీసుకువ చ్చింది వైసీపీ ప్రభుత్వం. విశాఖను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో బిల్లును సైతం ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీంతో.. అప్పట్నుంచి మొదలైన ఆందోళనలు, నిరసనలు రోజులు, నెలల తరబడి కాదు.. ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. ఇంకా అమరావతిలో ఇప్పటికీ రైతులు, మహిళలు తమ దీక్షలు కొనసాగిస్తున్నారు.

      ఇక, ప్రస్తుత ఎన్నికల వేళ అధికార పార్టీ నేతలు చేస్తున్నా కామెంట్లు సామాన్య ప్రజానీకంలో మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా ముందుకెళతామని ఇప్పటికే ప్రకటిం చింది అధికార వైసీపీ. ఇందుకు తగినట్లుగానే ఇప్పటికే విశాఖలో ఆయా శాఖల కోసం భవనాలను గుర్తించారు. రుషికొండ మీద నిర్మాణాలు చేపట్టారు. అయితే..పైకి ఇవి పర్యాటక భవనాలంటూ ప్రభుత్వం హడావిడి చేస్తున్నా… ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా, ఇంకా చెప్పాలంటే చివరకు మీడియాకు సైతం అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం ఇటీవలె వీటిని ప్రారంభించింది. ఇదే ప్రజల్లో మరిన్ని అనుమానాలు కలిగేలా చేస్తోంది. అటు.. విపక్షం మాత్రం అమరావతే ప్రజా రాజధాని అని చెబుతోంది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతికి పూర్వవైభవం కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడికక్కడ చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో గతంలో విపక్ష పాత్ర పోషించిన వైసీపీ.. అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.

    కేవలం టీడీపీ జనసేన అధినేతలే కాదు.. ఇటీవలె వైసీపీలో టికెట్లు దక్కని నేతలు సైతం ఇదే అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా చేసేందుకు ఒప్పుకున్న నాటి విపక్ష నేత జగన్.. ఆ తర్వాత అధికారంలోకి రాగానే మాట మార్చారని ఆరోపించారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. అంతేకాదు.. అమరావతిలోనే తాను నివాసం ఉంటున్నానని అదే రకంగా రాజధాని కూడా అమరావతే ఉంటుందని చెప్పారంటూ గతంలోనే ఫైరయ్యారు మ్మెల్యే వసంత.

     రాజధాని విషయంలో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అనుకుంటుంటే.. ఇటీవలె కొందరు వైసీపీ నేతలు మరో కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. మరికొన్నాళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగిం చాలన్న డిమాండ్ విన్పించారు. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి మరికొంత సమయం పడుతుందని.. అందువల్లే హైదరాబాద్‌ను మరికొన్నాళ్లపాటు ఏపీ, తెలంగాణకు ఉమ్మడి కేపిటల్‌గా ఉంచాలన్న డిమాండ్ విన్పించారు వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా తెరపైకి వచ్చిన ఈ డిమాండ్ రెండు రాష్ట్రాల నేతల మధ్యా మాటల యుద్ధానికి దారి తీసింది. వైవీ కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. దీంతో… నష్టనివారణ చర్యలకు ఏపీ సర్కారు దిగింది. సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ చెప్పుకొచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. అంతేకాదు.. రానున్న జూన్‌తో ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ హితవు పలికా రాయన.

       ఇంత వరకు బాగానే ఉన్నా… వైసీపీలో కీలకంగా వ్యవహరించే ముఖ్యనేతల్లో ఒకరు వైవీ సుబ్బారెడ్డి. అలాంటి నేత నోటి నుంచి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ మరికొంత కాలం పాటు అనే డిమాండ్ వచ్చిందంటే .. అది జగన్‌ నుంచి వచ్చిందేనని అనుకోవాలంటూ ఆరోపించింది టీడీపీ. ఎన్నికల వేళ ఈ మొత్తం వ్యవహారంలో ప్రజల్ని గందర గోళానికి గురి చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి డ్రామాలు ఆడుతోందని ఆరోపించింది. అటు కాంగ్రెస్‌ పార్టీది సైతం ఏపీ, తెలంగాణలో ఇదే మాట. మొత్తంగా చూస్తే.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ ప్రభుత్వం మాత్రం రాజధాని విషయంలో మాటలు మారుస్తోందని.. రకరకాల వాదనలు తెరపైకి తెచ్చి ప్రజల్లో మరింత గందరగోళం నెలకొనేందుకు కారణమవుతోందన్న వాదన బలంగా విన్పిస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్