ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియబోతుంది. 10 రోజులపాటు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉన్నారు. కస్టడీ ముగుస్తుండడంతో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు పురోగతి సాధించారు. కస్టడీలో కేజ్రీవాల్ వ్యవహరించిన తీరును కోర్టుకు వివరించ బోతున్నారు. కేజ్రీవాల్ను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోర్టును కోరే ఛాన్స్ ఉంది. కోర్టు జ్యూడీషియల్ కస్టడీకి అనుమతి ఇస్తే, కేజ్రీవాల్ను తిహార్ జైలుకు తరలించబోతున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, వంద కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు చేయడం వంటి అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసుల రెడ్డి సహా కవిత కోసం పనిచేసిన వ్యక్తులు, ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆప్ ఆఫీసు నుంచే గోవా ఎన్నికల వ్యవహారం నడిపించారని ఆ పార్టీ గోవా నేత ఈడీకి తెలిపారు. కేజ్రీవాల్ సతీమణి సునీత ఫోన్ డేటాను ఈడీ అధికారులు పరిశీలించారు. కేజ్రీవాల్ స్థిర, చర ఆస్తుల వివరాలు, ITR, ఇతర ఆర్థిక వివరాలను పరిశీలించారు. పంజాబ్లోని సీనియర్ ఎక్సైజ్ అధికారులతో పాటు ఢిల్లీ ఆప్ మంత్రి కైలాశ్ గెహ్లాట్ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. కస్టడీ ముగియడంతో ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే మరోసారి ఈడీ అధికారులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. దీంతో కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్తారా.. బయటకు
వస్తారా అనేది ఉత్కంఠగా మారింది.