స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు.. అంటూ ప్రధాని నరేంద్ర మోదీ హన్మకొండ సభలో తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం హిందీలో ప్రసంగాన్ని కొనసాగించారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తందని, తెలుగు వారి ప్రతిభ కీలకంగా మారిందని చెప్పారు. దేశానికి ఇది స్వర్ణయుగమని, అభివృద్ధిలో దేశాన్ని ముందు వరుసలో నిలిపేందుకు కేంద్రం నిరంతరం పనిచేస్తోందని అన్నారు. వివిధ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ఈరోజు శంకుస్థాపన చేశారు. అందులో రూ. 521 కోట్లు కాజీపేటలో నిర్మించనున్న వ్యాగన్ తయారీ పరిశ్రమకు రూ. 3,441 కోట్లు ఎకనామిక్ కారిడార్లో భాగంగా వరంగల్-మంచిర్యాల జాతీయ రహదారి విస్తరణకు రూ. 2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ ఇంటర్ కారిడార్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు అవుతుందని గుర్తు చేశారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో పలు చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని మోదీ చెప్పారు. కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయసహకారం అందిస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీని పెంచుతున్నామని, హైవేలు, ఎక్స్ప్రెస్వేలు, ఇండస్ట్రియల్-ఎకనామిక్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నామని మోదీ తెలిపారు.
దేశ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందన్నారు. ప్రపంచంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పుడు తెలంగాణ ప్రజల పాత్ర చాలా పెద్దదని అన్నారు. ప్రపంచం మొత్తం భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపుతోందని తెలిపారు. ప్రపంచం మొత్తం భారత్కు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నప్పుడు తెలంగాణకు అనేక అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. 21వ శతాబ్దపు ఈ మూడో దశాబ్దంలో మనకు స్వర్ణయుగం వచ్చిందని మోదీ అన్నారు. ఈ స్వర్ణయుగంలోని ప్రతి సెకనును పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నేడు తెలంగాణలో రూ. 6 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామన్నారు. దేశాభివృద్ధికి శరవేగంగా కృషి చేస్తున్నామని చెప్పారు.