స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్లోని దుండిగల్లో జరిగిన ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. త్రివిధ దళాల అధినేత్రి హోదాలో ఈ పరేడ్కు రివ్యూయింగ్ ఆఫీసర్గా రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఈ పరేడ్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ధైర్యవంతులు అయిన క్యాడెట్లను కన్న తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని తెలిపారు.
భారతీయ వైమానిక దళం అన్ని శాఖల్లోనూ మహిళా అధికారులను రిక్రూట్ చేయడం సంతోషకరమన్నారు. మహిళా ఫైటర్ పైలట్ల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏప్రిల్లో తాను సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్లో విహరించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్లో విహరించి బ్రహ్మపుత్రి, తేజ్పూర్ లోయలు, హిమాలయాల అద్భుతాలను వీక్షించానని చెప్పారు. సముద్ర మట్టానికి రెండు కిలోమీటర్ల ఎత్తులో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ఆకాశంలో విహరించడం తనకు గొప్ప అనుభూతిని మిగిల్చినట్లు ముర్ము తెలిపారు.