ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ముందే ఊహించారు. ఎన్నికల్లో నాలుగు రౌండ్ల ఫలితాల తర్వాత జరగబోయేది ఇదే అని ఆయన ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రశాంత్ కిశోర్ ముందే చెప్పారు.
దేశంలో తుది విడత పోలింగ్ ముగిసిన వెంటనే వైసీపీ విజయం సాధిస్తుందని కొన్ని సంస్థలు, టీడీపీదే గెలుపు అని మరికొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యల అనంతరం ప్రశాంత్ కిశోర్ స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. ఊహించని విధంగా వైసీపీ ఓటమిని ఎదుర్కోబోతోందని వ్యాఖ్యానిం చారు.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ సంస్థ తరఫున వైసీపీ కోసం పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీని విజయ పథంలో నడిపించే వ్యూహాలు రచించారు. అంతకు ముందు బీజేపీ తరఫున పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. అనంతరం ఆయన పశ్చిమ బెంగాల్లో తృణమూల్ తరఫున వ్యూహకర్తగా పనిచేశారు. మమతా బెనర్జీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంలో కీలకంగా వ్యవహరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్ జనతాదళ్ (యు) తరఫున వ్యూహాలు రచించి, నితీష్కుమార్ సీఎం అయ్యేలా కృషి చేశారు. తమిళనాడులో కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహాల ఫలితంగా డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఎం. కే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు.రాజకీయ వ్యూహాలు రచించడంలో ప్రశాంత్ కిశోర్ దిట్ట అనేది పలు మార్లు నిరూపితమైంది. ఆయన అంచనాలు, జోస్యాలు కూడా నిజం అవుతాయనేందుకు తాజాగా ఏపీ లోని ఎన్నికల ఫలితాలు ఉదాహరణగా నిలిచాయని చెప్పొచ్చు.


