తెలంగాణ పోలింగ్కు గడువు దగ్గర పడుతోంది. ఎన్నికల ప్రచారంలో ఆఖరిఘట్టం అదిరిపోనుంది. వారం రోజుల పాటు అన్ని పార్టీల అగ్రనేతల ప్రచారంతో తెలంగాణ హోరెత్తబోతోంది. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా అలాగే కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంక గాంధీలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. జనసేన తరఫున పవన్ కల్యాణ్ కూడా చివరి అంకం ప్రచారంలో పాల్గొంటారు. దీంతో తుది విడత ప్రచారం తారస్థాయికి చేరనుంది.
తెలంగాణ ఎన్నికలకు పోలింగ్ దగ్గరపడింది.ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. దీంతో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి పట్టుమని వారం రోజులే గుడువుంది. ఎన్నికల ప్రచారంలోని ఈ చివరి ఘట్టం అదిరిపోనుంది. చివరి ఘట్టం ప్రచారంలో భాగంగా దాదాపు వారం రోజుల పాటు వివిధ పార్టీల అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. తెలంగాణలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. తమ మార్క్ ప్రచారంతో తెలంగాణను హోరెత్తించనున్నారు.
దాదాపు ఈ నెల 24 నుంచి ఇటు కాంగ్రెస్, అటు భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు, రాష్ట్ర శాఖ కీలక నాయకులు చివరి ఘట్టం ప్రచారంలో పాల్గొంటారు. దీంతో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి వెళ్లనుంది. జాతీయ స్థాయి నేతలు వచ్చే అవకాశాలు ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ తో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా బహిరంగ సభలు, సమావేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
కాంగ్రెస్ తరఫున అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రావడం ఖాయమంటున్నారు ఆ పార్టీ నాయకులు. సోనియా గాంధీ కూడా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. వీరితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా చివరి ఘట్టంలో తెలంగాణకు రానున్నారు. అభయహస్తం పేరుతో రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టోను ఇటీవలఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నే విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు కర్ణాటక కాంగ్రెస్ ప్రముఖుడు డీకే శివకుమార్ కూడా వస్తారంటున్నారు స్థానిక నాయకులు.
రాహుల్ , ప్రియాంక ఈనెల 24 నుంచి 28 వరకు దాదాపు ఇరవైకి పైగా సభల్లో పాల్గొంటారు. ప్రియాంక గాంధీ పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి, ఖమ్మం, వైరా, మధిర, మునుగోడు, కామారెడ్డి సహా అనేక సభల్లో పాల్గొంటారు.
ఇక బీజేపీ విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా వస్తారని కమలం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 25,26,27 తేదీల్లో మూడు రోజులు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కామారెడ్డి, మహేశ్వరం, తూప్రాన్, నిర్మల్, మహబూబాబాద్, కరీంనగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సభలను ఏర్పాటు చేశాయి కమలం పార్టీ వర్గాలు. అలాగే 24,26,28 తేదీల్లో అమిత్ షా ప్రచార కార్యక్రమాలు ఉంటాయి. కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వీరితో పాటు యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిమంత్ బిశ్వ శర్మ, ప్రమోద్ సావంత్ కూడా ప్రచారం లో పాల్గొంటారు. ఒక్కోనేత పదులు సంఖ్యలో సభల్లో పాల్గొంటారు. చివరి మూడు రోజులు అన్ని పార్టీలు హైదరాబాద్ సిటీపై దృష్టి పెట్టాయి.
ఇక లెఫ్ట్ పార్టీల జాతీయ నాయకులు కూడా చివరి దశ ప్రచారంలో పాల్గొంటారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్, సుభాషిణీ అలీ, విజయరాఘవన్ ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లా లో పర్యటిస్తారు.
బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా చివరి దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. హన్మకొండలో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక, తాండూరు సభల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. అలాగే ఈనెల 26న కూకట్పల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి రోడ్షోలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు.
కాగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 25న హైదరాబాద్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తరువాత 28న వరంగల్, గజ్వేల్ బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. మొత్తంమ్మీద తెలంగాణలో ఇక ఎటు చూసినా అన్ని పార్టీల అగ్రనేతల ప్రచార సందడే కనిపించబోతోంది.