స్వతంత్ర వెబ్ డెస్క్: భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మినహా బీజేపీయేతర పాలనలో ఉన్న రాష్ట్రాలలో ప్రధాని పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం ఛత్తీస్ గఢ్, ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించిన ప్రధాని.. శనివారం ఉదయం తెలంగాణాలో పర్యటించగా.. మధ్యాహ్నం రాజస్థాన్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలలో ప్రధాని రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో రూ.7,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ వెళ్లి రెండు వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం ఉదయం వరంగల్ చేరుకున్న ప్రధాని.. కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ ఫ్యాక్టరీకి భూమి పూజతో పాటు రూ.6,100 కోట్ల అభివృధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం హన్మకొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసింగించారు.
మధ్యాహ్నం రాజస్థాన్ కు చేరుకుని బికనీర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అమృత్సర్-జామ్నగర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభిస్తారు. వందేభారత్ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు. నౌరంగ్దేసర్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. రాజస్థాన్ లో రూ.25 వేల కోట్ల విలువైన పనులను ప్రధాని మోదీ ప్రారంభించి, భూమిపూజ చేయనున్నారు.