పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈనెల 28న రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుందని..అందులో హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితం రాకపోయినా ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పారు. మండల స్థాయి నుండి జాతీయ స్థాయి నాయకులు అంతా 28వ తేదీన సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. 90 రోజుల యాక్షన్ ప్లాన్ను ఈ సమావేశంలో నిర్ణయిస్తామని వెల్లడించారు. 22, 23 తేదీల్లో ఢిల్లీలో పదాదికారుల సమావేశం జరిగిందని .. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన విషయాలపై చర్చ జరిగిందన్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లపై కూడా విశ్లేషించుకున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వని ప్రజలు, పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ మోదీకే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని కాంగ్రెస్ చెప్పిందని.. అందుకే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాలలో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ కి సెమీ ఫైనల్ అని చెప్పిన కాంగ్రెస్కి కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే అవకాశం దక్కిందని ఎద్దేవా చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన. మళ్ళీ నరేంద్ర మోదీనే ప్రధానిగా ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో బిజెపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయిలో కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 28వ తేదీ నుంచి మరింత ముందుకు వెళ్తున్నామని చెప్పారు. భారీ స్థాయిలో యువత బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న కిషన్ రెడ్డి… వారందరినీ కలుపుకుని ముందుకు వెళ్లి విజయం సాధిస్తామన్నారు.


