36 మంది కార్యకర్తలు చనిపోతే జగన్, వైసీపీ నాయకులు ఎందుకు వారి కుటుంబాలను పరామర్శించలేదని ప్రశ్నించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపిస్తున్నారని… ఇంతవరకు జగన్ నియమించిన పోలీసుల్లో కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు ఒక్కరినీ మార్చలేదన్నారు. ఇండియా కూటమి నాయకులతో చర్చించడానికే ఢిల్లీకి వెళ్లానని నేరుగా చెప్పకుండా.. ముసుగులు ఎందుకని పయ్యావుల ప్రశ్నించారు. హత్యలు జరిగితే డీజీపీకి, గవర్నర్కు ఫిర్యాదు చేస్తారు కానీ… నేరుగా ఢిల్లీకి వెళ్లరని అన్నారు. జగన్కు భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తోందని పయ్యావుల ఎద్దేవా చేశారు.. చనిపోయిన వారిపై అసెంబ్లీలో చర్చిద్దాం రమ్మంటే ఎందుకు రాలేదని పయ్యావుల నిలదీశారు
అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు 6లక్షల కోట్లు అన్నారని .. ప్రస్తుతం ఇది 9.75లక్షల కోట్లకు చేరిందన్నారు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థలో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని చెప్పారాయన. అధికారులు రోజూ రాత్రి పది గంటల వరకు కూర్చుంటే తప్ప వాస్తవాలు బయటికి రావడంలేదని వివరించారు. ఇక వివరాలన్నీ తెలిస్తే అప్పు 12లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని పయ్యావుల కేశవ్ తెలిపారు.
గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు అడిగితే.. అధికారులు మొదట 8 వేల కోట్లు అని పయ్యావుల చెప్పారు. అనంతరం అది రూ.28వేల కోట్లకు చేరిందన్నారు. ఈ అప్పుల చిట్టా ఇంకా పెరిగే అవకాశం ఉందని… జగన్ గొప్పగా ప్రచారం చేసుకున్న పాఠశాల విద్యార్థులకు ఇచ్చే చిక్కీలు, కోడిగుడ్లకు కూడా బకాయిలు పెండింగులో ఉన్నాయన్నారు. ఆసుపత్రుల మౌలికవసతులకు సంబంధించి 6 వేల కోట్ల బిల్లులు చెల్లించాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి కాదన్న పయ్యావుల కేశవ్.. అర్థం చేసుకోవడానికే సమయం పడుతోందని వివరించారు. గత ప్రభుత్వంలో మొదటి రోజు నుంచే పరిపాలన ప్రారంభించామని జగన్ చెబుతున్నారని… 2019లో మేం నిక్కచ్చిగా లెక్కలు చెప్పాం కాబట్టే అది సాధ్యమైందని అన్నారు. బడ్జెట్ పెట్టలేకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని విమర్శిస్తున్నారని అన్నారు. ఆ పరిస్థితికి తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన ఫైరయ్యారు. ఏ శాఖలో కూడా వివరాలను కచ్చితంగా నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఆర్థిక అరాచకం జరిగిందన్న పయ్యావుల కేశవ్.. ఆర్థిక వ్యవస్థను చంపేశారని మండిపడ్డారు.