స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MP MVV Satyanarayana) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Steel Plant Privatization)పై కేంద్రాన్ని (Central) ఎందుకు ప్రశ్నించడంలేదు.. అసలు కాపు కులానికి ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని, పవన్ కన్నా కేఏ పాల్ (KA Paul) వెయ్యి రెట్లు బెటర్ అని అన్నారు. వీధి రౌడీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్కు తేడా లేదని, తనని రాజీనామా చేయమనడానికి పవన్ ఎవరు అని ఎంవివి రీకౌంటర్ ఇచ్చారు.
ఎమ్మెల్యేగా గెలవలేని పవన్.. తన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. దమ్ముంటే మళ్లీ గాజువాకలో పోటీ చేయాలని, లేదా తనపై పోటీ చెయాలని సవాల్ చేశారు. విశాఖపట్నం అభివృద్ధిలో తన పాత్ర ఉందని, అనేక నిర్మాణాలు చేశానన్నారు. పవన్కు దమ్ము, ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయాలన్నారు. కాపు కులస్తుల ఆత్మభిమానాన్ని రాజకీయం కోసం పవన్ వాడుకుంటున్నారని ఎంపీ తీవ్రస్థాయిలో విమర్శించారు.
పవన్ ఒంటరిగా ఏం చేయలేరని, రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని, జనసేన మేనిఫెస్టో ఏంటో ప్రజలకు వెల్లడించాలని ఎంవీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. పార్టీని సరిగా నడిపించలేకపోతున్నారని.. గెలిచిన ఓకే ఓక ఎమ్మెల్యేను కూడా ఉంచుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. పవన్ తనపై చేసిన ఆరోపణలు అసత్యాలని, మేము నిర్మిస్తున్న భవనం వద్ద ఎలాంటి ప్రభుత్వ స్థలం లేదని అన్నారు. కనీసం అవగాహన లేకుండా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఎంవీవీ సత్యనారాయణ విమర్శించారు.