హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు మార్గం సుగమమైంది. టోల్ వసూలు బాధ్యతల నుంచి జీఎమ్మార్ సంస్థ తప్పుకోవడంతో ఈ అడ్డు తొలిగింది. ఈ మేరకు జీఎమ్మార్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. జీఎమ్మార్ తప్పుకోవడంతో కొత్త గుత్తేదారు ఎంపికయ్యే వరకూ టోల్ వసూలు బాధ్యతలు ఎన్హెచ్ఏఐ నిర్వహించనుంది. ఇన్నాళ్లపాటు అడ్డంకిగా ఉన్న జీ ఎమ్మార్ తొలిగిపోవడంతో త్వరలోనే హైవే విస్తరణ పనులు ప్రారంభంకానున్నాయి.
మొదట్లో రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డును బీఓటీ పద్ధతిలో విస్తరించడానికి 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండరు పిలిచింది. జీఎమ్మార్ గుత్తేదారు సంస్థ ఒక వేయి 740 కోట్లకు టెండర్ వేసి పనులను దక్కించుకుంది. ఈక్రమంలోనే యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్, మండలం దండుమ ల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకూ 181.5 కిలోమీటర్ల పొడవున రహదారిని నాలుగు వరసలుగా విస్తరించింది. 2021 డిసెంబర్లో పనులను పూర్తి చేసి, తెలంగాణ పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలను నిర్వహిస్తోంది. 2025 జూన్తో టోల్ వసూళ్ల గడువు ముగియనుంది.హైవే విస్తరణకు భూసేకరణ చేస్తున్నప్పుడే ఆరు వరుసల నిర్మాణానికి సరిపడా భూమిని సేకరించారు. అయితే, టెండర్ ఒప్పందం ప్రకారం, 2024 కల్లా హైవేను ఆరు వరుసల్లో విస్తరించాలి. కానీ, తెలుగు రాష్ట్రాల విభజనతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని జీఎమ్మార్ కోర్టును ఆశ్రయించింది. అప్పట్లో రవాణా వాహనాలు ముఖ్యంగా ఇసుక లారీలు ఏపీకి భారీగా వెళ్లేవని, తెలంగాణ ఏర్పాటయ్యాక వాటి సంఖ్య గణనీయంగా తగ్గిందని, దీంతో రోజుకు 20 లక్షల చొప్పున నెలకు 6 కోట్ల రూపాయల వరకూ నష్టం వాటిల్లుతోందని తమ పిటిషన్లో పేర్కొంది. ఈ కారణంగా విస్తరణ ఆగిపోయింది. ఈ క్రమంలో జీఎమ్మార్, ఎన్హెచ్ఏఐల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అనంతరం, గడువుకన్నా ముందే టోల్ వసూలు బాధ్యతల నుంచి తప్పుకునేందుకు జీఎమ్మార్ అంగీకరించింది. దీంతో, సంస్థకు నష్టపరి హారం చెల్లించేందుకు ఎన్హెచ్ఏఐ కూడా అంగీకరించింది. విడతల వారీగా ఈ మొత్తాన్ని చెల్లించను న్నట్టు తెలుస్తోంది.తన పర్యవేక్షణలో మూడు నెలలపాటు తాత్కాలిక ప్రాతిపదికన టోల్ వసూలుకు రెండు ఏజెన్సీలను ఎన్హెచ్ఏఐ ఎంపిక చేసింది. పంతంగి, కొర్లపహాడ్లలో టోల్ వసూలు బాధ్యతను స్కైల్యాబ్ ఇన్ఫ్రా, చిల్లకల్లులో వసూలు బాధ్యతను కోరల్ ఇన్ఫ్రా సంస్థలు దక్కించుకు న్నాయి.