రాష్ట్రంలో మిస్టీరియస్ డెత్స్ జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ అంశాలపై స్పందించారు. దుబాయిలో సినీ నిర్మాత కేదార్ చనిపోతే కేటీఆర్ ఎందుకు విచారణ కావాలని కోరడం లేదని ప్రశ్నించారు. రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ కేసులో కేదార్ నిందితుడిగా ఉన్నారని అన్నారు. కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని… కేసు వాదించిన సంజీవరెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారని అన్నారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్లో అనుమానాస్పదంగా చనిపోతే జ్యూడిషియల్ విచారణ ఎందుకు కోరడం లేదని.. ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ” ప్రధానమంత్రితో కులగణపై చర్చ జరగలేదు. అసెంబ్లీలో బిల్ చేశాక చర్చిద్దాం అనుకుంటున్నాం. నదులను పునరుద్ధరణ చేయడం మంచి ఆలోచనని ప్రధాని అన్నారు. హైదరాబాదుకు మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి. హైదరాబాద్ మెట్రోలో జైపాల్ రెడ్డి పాత్ర చాలా కీలకం. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో సెకండ్ ప్లేస్ లో ఉండేది.. ఇప్పుడు 9వ స్థానంలో పడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాము. గెలుస్తామని అనుకుంటున్నాం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపిని గెలిపించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోటీ పెట్టలేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదు. మంత్రివర్గ విస్తరణ ఉందని నేను ఎప్పుడూ చెప్పలేదు . పిసిసి కమిటీ అంశం అధ్యక్షుడిని అడగాలి. శివరాత్రి పూజలు ఉన్నందునే భట్టి విక్రమార్క ఢిల్లీకి రాలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్ రావును రప్పించాలని కేంద్రానికి లేఖ రాశాను. గత ప్రభుత్వ అవినీతిపై కమిషన్లు వేశాము. కమిషన్ల నివేదిక వచ్చాకే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం.
కొడంగల్ అసెంబ్లీ వ్యవహారాలు నా బ్రదర్ చూసుకుంటాడు. కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నా బ్రదర్ ను పెట్టాం. రియల్ ఎస్టేట్ గతంలో కంటే మెరుగ్గానే ఉంది. ఏడు ఎనిమిది ఏళ్లకు ఒకసారి కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈసారి ఆక్యుపేషన్ బాగా పెరిగింది. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలోనే పర్ఫామెన్స్ బెటర్గా ఉంది. జనాభా ప్రకారమే కేంద్రం నిధులు కేటాయిస్తామనడం సరైంది కాదు. మెరిట్ ప్రకారం కూడా నిధులు కేటాయించాలి. 50 శాతం పాపులేషన్ ప్రకారం నిధులు కేటాయిస్తే.. మెరిట్ ప్రకారం 50 శాతం నిధులు కేటాయించాలి.
ఐపీఎస్ల కేడర్పై 2016లో రివ్యూ అయింది. తెలంగాణకు 29 మంది కేడర్ రావాల్సి ఉంది. మూసి పునర్జీవనం కోసం రూ.20 వేల కోట్లు అడుగుతున్నాం. సబర్మతి, గంగా, యమునాల ప్రాజెక్టులను ఇప్పటికే కేంద్రం ఆచరణలో పెడుతుంది. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడంతో పాటు డ్రైపోర్టు, బందర్పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కావాలి.. దాంతో పాటు రైల్వే లైన్ కూడా కావాలి. మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేయాలి అనేది మా లక్ష్యం.
సెమీ కండక్టర్ల తయారీ కోసం తెలంగాణకు అవకాశం కల్పించాలని కోరాం. ఎస్ఎల్బీసీ పనులు పదేళ్ల నుంచి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగింది . కాంగ్రెస్ హయాంలో 30 కిలోమీటర్లు పూర్తయింది”.. అని రేవంత్ రెడ్డి అన్నారు.