స్వతంత్ర, వెబ్ డెస్క్: మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖులు సందడి చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన యాగంలో పాల్గొన్నారు పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి వాహానాన్ని పరిశీలించారు. పవన్ను కలిసిన వారిలో ప్రముఖ నిర్మాతలు డివీవీ దానయ్య, ఏఎం రత్నం, బీవీఎస్ఎన్ ప్రసాద్, రవిశంకర్, వివేక కూఛిబొట్ల, దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నారు. వీరంతా ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలకు సంబంధించిన వారే కావడం విశేషం. రాజకీయాల్లో బిజీగా ఉంటూ షూటింగులు చేయాలనే అంశంపై వీరి మధ్య చర్చ జరిగింది.
ఇకపై ఏపీ కేంద్రంగా జనసేన కార్యకలాపాలు నిర్వహించనున్న క్రమంలో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగులు చేపట్టాలని నిర్ణయించారు. కొన్ని లొకేషన్లను కూడా వీరు చూసి వచ్చారు. ఈ ప్రాంతం షూటింగులకు అనుకూలంగా ఉందని హరీశ్ శంకర్ తెలిపారు. పవన్ సినిమా షూటింగులే కాకుండా.. ఇతర సినిమాల షూటింగులను కూడా నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నామని పేర్కొన్నారు. త్వరలోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగులు జరగబోతున్నాయని హరీశ్ వెల్లడించారు.