అభివృద్ధిలో ఏపీ సాధించింది సున్నా, అవినీతిలో మాత్రం టాప్ పొజిషన్, ఏపీలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే.! జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఈ మాటలు అన్నది చంద్రబాబో, పవన్ కల్యాణో కాదు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలు ఇవి. ఏపీలో సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని మోదీ. మొదటి సారి జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. రెండు సభల్లో ప్రధాని మోదీ జగన్పై తీవ్ర విమర్శలు చేయడంతో వైసీపీ బ్యాచ్కు ముచ్చెమటలు పట్టాయని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. అయితే ప్రధాని విమర్శలకు వైసీపీ కౌంటర్లు కూడా రెడీ చేసింది. దీంతో ఎన్నికల వేళ ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది.
ఏపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ జగన్ టార్గెట్గా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబుతో పాటు పవన్ పై అనుకూల వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాలన చేతకాని వ్యక్తి జగన్ అని ప్రధాని మోదీ ఆరోపించారు. అమరావతి, పోలవరంవంటి సమస్యలను కూడా ప్రస్తావించారు. జగన్ ఒక్క రాజధాని కూడా కట్టలేదని, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లిందని, జగన్ పాలనలో మాత్రం అభివృద్ధి పట్టాలు తప్పిందని ఫైర్ అయ్యారు. అయితే గత ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ విషయంలో బిజెపి ఉదాసీనంగా వ్యవహరించింది.మొన్నటి చిలకలూరి పేట సభలో కూడా మోదీ జగన్ని పెద్దగా విమర్శించలేదు. కానీ ఈ ఎన్నికలవేళ జగన్ పాలనపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేయడంతో టీడీపీ శ్రేణులు కుదుటపడ్డాయి.
మరోవైపు ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడకుండా మోడీ పరార్ అయ్యారని ఎద్దేవా చేశారు. విశాఖ రైల్వేజోన్పై కూడా ఆయన అవగాహన లేకుండా మాట్లాడారని చెప్పారు. టీడీపీ తయారు చేసిన స్క్రిప్ట్నే మోదీ చదివారని విమర్శించారు. జూన్ 4న ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని మోదీ చెప్పారని..కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేది బంగాళాఖాతంలోనే నని ఎద్దేవా చేశారు. అయితే ప్రధాని మోదీపై బొత్స వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ పాలనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలని చెప్పారు. అసలు బొత్స విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ల్యాండ్, సాండ్ మాఫియా రాజ్యమేలుతోందని సాక్షాత్తు ప్రధాని మోదీనే విమర్శిస్తుంటే..బొత్స మాత్రం ఏం మారలేదని బుకాయిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఇసుక, మద్యం మాఫియాతో ప్రజల డబ్బుంతా దోచేస్తున్నారని, ఈ సారి ఎన్నికల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని లోకేష్ స్పష్టం చేశారు. ఇక బొత్స సత్యనారాయణ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. బొత్స సత్యనారాయణ మంత్రిగా అర్హత లేని వ్యక్తి అన్నారు. సీఎం జగన్కు అవినీతి వ్యక్తులు మాత్రమే కనిపిస్తారని మండిపడ్డారు. రైల్వేజోను భవనాల ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం అడ్డుపడిందన్నారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాస్తవాలను తెలిసేలా చేశారని ఆయన తెలిపారు. మొత్తానికి ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం రాష్ట్ర రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. గతానికి భిన్నంగా జగన్పై మోదీ చేసిన విమర్శలు వైసీపీకి మాత్రం ముచ్చెమటలు పట్టిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. అటు టీడీపీలో మాత్రం ప్రధాని మోదీ కామెంట్స్ కొత్త జోష్ని నింపుతున్నాయని చెప్పవచ్చు.


