స్వతంత్ర వెబ్ డెస్క్: మహారాష్ట్రలో మహిళా ఎమ్మెల్యే అందరి ముందు ఇంజనీర్ చెంప చెళ్లుమనిపించింది. థానే జిల్లా మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేశారు. వీటి కూల్చివేతతో వర్షంలో చిన్నారులు, వృద్ధులు రోడ్డున పడ్డారంటూ మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా భరత్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క విపరీతంగా వర్షం కురుస్తున్నప్పుడు నిర్మాణాలు ఎలా కూలుస్తారంటూ ఎమ్మెల్యే ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ క్రమంలోనే జూనియర్ సివిల్ ఇంజినీర్ శుభమ్ పాటిల్పై ఆమె చేయిచేసుకున్నారు .. నిర్మాణాలు కూల్చివేయడంతో చాలా మంది రోడ్డున పడితే అధికారులు నవ్వుకోవడం చూసి తాను భరించలేకపోయానని ఎమ్మెల్యే అన్నారు. బాధితులు తమ కష్టాలను చెప్పుకుంటుంటే అధికారి నవ్వడం చూసి నేను నియంత్రణ కోల్పోయానని.. తమ ఇంటిని కూల్చివేయడం చూసి మహిళలు ఏడుస్తుంటే సంబంధిత అధికారి వారిని చూసి నవ్వుతున్నారని మండిపడ్డారు. తన చర్య అతనికి సహజమైన ప్రతిచర్య అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అయితే మరో వైపు ఎమ్మెల్యే ఇంజనీర్ ను దూషించి చెంప చెళ్లుమనిపించిన ఘటనకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీంతో ఎమ్మెల్యేపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆక్రమణల కూల్చివేతలో వారి తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.