Punjab | వేసవికాలంలో ఎండలు మండుతుండడంతో విద్యుత్ వినియోగం కూడా ఎక్కువైపోతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ఒంటిపూట బడుల తరహాలోనే ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7.30గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే పనిచేస్తాయని సీఎం భగవంత్ మన్(Bhagwant mann) ప్రకటించారు. మే2 నుంచి జులై 15వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని.. అనంతరం ఎప్పటిలాగే ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5వరకు కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపారు.
Punjab |ఉద్యోగులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో విద్యుత్ వాడకం తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో మధ్యాహ్నం 1.30గంటల తర్వాతే విద్యుత్ గరిష్ట వినియోగం మొదలవుతుందని పంజాబ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. దీంతో 2గంటలకే ప్రభుత్వ కార్యాలయాలు మూసివేస్తే విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుందని చెప్పారు. సీఎం నిర్ణయంపై ఉద్యోగులతో పాటు మెజార్టీ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దేశమంతా ఇలాంటి నిర్ణయం అమలు చేస్తే కరెంట్ సేవ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.