తెలంగాణలలో లోక్సభ ఎన్నికల ఘట్టం ముగిసింది.దీంతో రాజకీయ పార్టీలన్నీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై దృష్టి సారించాయి. ఈ నెల27న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. ఈ ఎమ్మె ల్సీ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో ఈ స్ధానం నుంచి ఎన్నికైన పల్లా రాజేశ్వర రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందటంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్ధిగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది బరిలో నిలిచారు. అయినా ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే ఉంటుంది. మరి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుపు ఎవరి ఖాతాలో పడనుందనేది ఉత్కంఠగా మారింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో పట్టభ ద్రుల ఉపఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓట్లు కీలకం కానున్నాయి. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం లోనూ ఖమ్మం జిల్లా ఓట్లే కీలకమయ్యాయి. దీంతో అన్ని పార్టీల అభ్యర్ధుల దృష్టి ఖమ్మం జిల్లాపైనే పడింది. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్ట భద్రుల ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న జిల్లా మంత్రులను కలిసి, తన విజయం కోసం కృషి చేయాలని కోరారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ పది అసెంబ్లీ నియోజకవర్గాలరు ఇంచార్జ్లను కూడా నియమించింది.
గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ ఈ సారి తన పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఆ పార్టీ అభ్యర్ధి గా ఏనుగుల రాకేష్రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన జిల్లాలో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంబించారు. జిల్లాకు చెందిన మఖ్య నాయకులను కలిసి మద్దతు కోరారు. హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టా త్మకంగా తీసుకోవాలని జిల్లా నేతలకు కేటీఆర్ సూచించారు. మొత్తం మీద మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఎన్నికల్లో విజయం కోసం ముమ్మరంగా ప్రచారాలు ప్రారంభించారు. పోలింగ్ సమయం తక్కువగా ఉన్నందున ఆయా నియోజక వర్గాల్లోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల, జిల్లా స్థాయి నాయకులు ప్రచారం చేపట్టారు.
పట్టభద్రుల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ కూడా రంగంలోకి దూకింది. ఆ పార్టీ నేతలు జిల్లాలో సభలు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యాసంస్ధలు, విద్యావంతులను ఆయా వృత్తుల వారిని, ఉద్యోగులను కలిసి మద్దతు కూడగడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షం గా తామే పోటీ ఇచ్చామని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను నిలదీసే సత్తా తమకే ఉందని, బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్ధి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు. ఆయన గెలుపుకోసం ఖమ్మంలో బీజేపీ నేతలు బీజేపీ శ్రేణులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం టీడీపీ, జనసేన సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయానికి వెళ్లి బీజేపీ నేతలు మద్దతు అడిగారని తెలుస్తోంది.