స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం ఈ నెల 4 నుంచి మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18 వరకు కొనసాగనుంది. ఇప్పటికే పది రోజులు గడిచిపోయాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు(Telangana Liquor Shops Notification 2023)గానూ.. కేవలం 21,656 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2021లో తొలి ఎనిమిది రోజుల్లోపే.. 30 వేల దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. ఈసారి భారీగానే దరఖాస్తులు వస్తాయన్న అంచనా తలకిందులై గతంలో కంటే పది వేల దరఖాస్తులు తగ్గాయి. గతంలో ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున రూ.1,357 కోట్లు రాగా.. ఈసారి రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి అంతా ఆశాజనకంగా లేదు.
ఇప్పటివరకు వచ్చిన 21,656 దరఖాస్తుల్లో.. 11వ తేదీన ఒక్కరోజే అత్యధికంగా 8 వేల 491 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో ఆబ్కారీ శాఖ(Telangana Liquor Tenders) ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ఆశించిన స్థాయిలో అర్జీలు రాని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షించాలని నిర్ణయించింది.
అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మద్యం దుకాణానికి కనీసం 20 దరఖాస్తులు రావాల్సిందేనని నిబంధన పెట్టింది. లేదంటే మళ్లీ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు కొందరు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు బాహాటంగా సర్క్యులర్లు కూడా ఇస్తున్నారు. తాజాగా ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud on Liquor Tenders) ఇదే అంశంపై అధికారులతో సమీక్షించారు. ఆబ్కారీ జిల్లాల వారీగా తీసుకుంటే ఎక్కడైతే… తక్కువ దరఖాస్తులు వస్తున్నాయో అక్కడికి ప్రత్యేక అధికారిని డిప్యూట్ చేయాలని ఆబ్కారీ శాఖ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీని మంత్రి ఆదేశించారు.