తోబుట్టువు అంటే కేవలం కలిసి పెరగడం.. ప్రేమను పంచుకోవడం కాదు! కష్టసుఖాల్లో కలిసి ఉండటం. చెల్లెలు కష్టాల్లో ఉంటే…నీకు నేనున్నానని తోడుగా చెప్పే అన్నయ్య ఉండాలి. అలాంటి అన్నాచెల్లెళ్లు అనురాగ బంధానికి ప్రతీకగా నిలుస్తారు కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవిత.
కేసీఆర్ ఇద్దరు పిల్లలకూ తెలంగాణ మలిదశ ఉద్యమంతో సంబంధం ఉంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మలిదశ ఉద్యమం హోరెత్తుతున్న రోజుల్లోనే కేటీఆర్, కవిత ఇద్దరూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం లో ఇద్దరూ పాల్గొన్నారు. సర్వజనుల సమ్మె…మిలియన్ మార్చ్ వంటి ఆందోళనా కార్యక్రమాలతో కేటీఆర్, కవిత ఇద్దరికీ సంబంధం ఉంది. కేటీఆర్ ….అప్పటి టీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అయితే కవిత మాత్రం జాగృతి పేరుతో తెలంగాణవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. జాగృతిని వేదికగా చేసుకుని బతకమ్మ పండుగను తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అట్టహాసంగా నిర్వహించారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగకు దేశవ్యాప్తంగా గ్లామర్ తీసుకువచ్చారు కల్వకుంట్ల కవిత. మరోవైపు గులాబీ పార్టీ కార్యక్రమాల్లో కల్వకుంట్ల తారక రామారావు చురుకుగా పాల్గొన్నారు. గులాబీ పార్టీని ప్రజలకు దగ్గర చేయడంలో కేటీఆర్ పాత్ర కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు కేటీఆర్. అంతేకాదు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యారు. ఐటీ శాఖామంత్రిగా కేటీ ఆర్ సత్తా చాటారు. హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ కీలకంగా మారారు. విదేశాలకు చెందిన పలు కార్పొరేట్ సంస్థలు హైదరాబాద్లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేయడంలో కేటీఆర్ చొరవ చూపారు.
బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత అంచెలంచెలుగా ఎదిగారు. 2014 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణకు సంబంధించిన సమస్యలను లోక్సభలో ప్రస్తావించారు. అయితే ఆ తరువాత 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మరోసారి కవిత పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికలో కవిత పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ ఆమె డీలా పడలేదు. ప్రజాక్షేత్రంలో పనిచేయడం మానలేదు. ప్రత్యక్ష రాజకీయాలతో అనుబంధం తెంచుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ తరువాత కవిత ఎమ్మెల్సీ అయ్యారు. శాసనమండలి సభ్యురాలిగా సభా కార్యక్రమా ల్లో, వివిధ అంశాలపై జరిగిన చర్చల్లో కవిత చురుకుగా పాల్గొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించడంలో సౌత్ గ్రూప్ కీలకపాత్ర పోషించిందన్న ఆరోప ణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వచ్చాయి. దీంతో కవిత నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికా రులు సోదాలు జరిపారు. ఆ తరువాత కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అట్నుంచి తీహార్ జైలుకు కవితను తరలించారు. కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు ఒక సోదరుడిగా కేటీఆర్ అడ్డుకున్న సంఘటనను తెలంగాణ సమాజానికి ఇంకా గుర్తుంది. ఏ నిబంధనల కింద కవితను అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ సోదరిని కాపాడటానికి కేటీఆర్ ప్రయత్నించారు. కవిత అరెస్టు జరిగిన తరువాత ఒక దశలో కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కళ్లు చెమర్చాయి. ఏమైనా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తున్నారు కేటీఆర్, కవిత.