ప్రజా ఉద్యమాలకు, చైతన్య పోరాటాలకు గుమ్మంగా నిలిచింది ఖమ్మం జిల్లా. తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో కీలక భూమిక పోషించింది. జై తెలంగాణ, ఇడ్లీ, సాంబర్ గోబ్యాక్’ అంటూ గర్జించి తొలిదశ ఉద్యమానికి ఊపిరిలూదింది. అన్నాబత్తుల రవీంద్రనాధ్, పోటు కృష్ణమూర్తి, కొలిశెట్టి రాందాస్, తిప్పన సిద్దులు వంటి పోరాటయోధుల స్పూర్తితో మలి దశ ఉద్యమంలో తనదైన పాత్రను పోషించింది. కేసీఆర్ ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించినప్పుడు ఉద్యమగానమై మార్మోగింది. సకల జనుల సమ్మెలో సబ్బండ వర్గాలు రోడ్డెక్కి తమ ఆకాంక్షను చాటినప్పుడు. ఆంధ్రాకు సరిహద్దున ఉన్నప్పటికీ తనదైన ప్రత్యేక స్కృహతో తెలంగాణ సాధనోద్యమంలో ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించింది.
చైతన్యాల ఖిల్లాగా పేరుగాంచిన ఖమ్మం జిల్లా మలిదశ ఆరంభం నుంచి చివరి వరకూ అడుగడుగునా తన క్రీయాశీలతను చాటింది. ఎన్నో ఘట్టాలకు, పరిణామాలకు వేదికగా నిలిచింది. మలిదశ ఉద్యమం 2009 సమయంలో కరీంనగర్లో అరెస్ట్ అనంతరం కేసీఆర్ను ఖమ్మం తీసుకురాగా.. ఆయన ఆసుపత్రి లో చేపట్టిన దీక్ష కీలక మలుపుగా నిలిచింది. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలు రాజకీయ పక్షాల నాయకులు కేసీఆర్కు అండగా నిలిచిన తీరు ఉద్యమ కాంక్షను మరింత రగిల్చింది. అటు కేటపీఎస్ కార్మికులు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు అధికారులు మేము సైతం అంటూ ఉద్యమసారధులై సమైక్యంగా కదిలిరావడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. 1969లో పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పురుడు పోసుకుంది. కేటీపీఎస్ నిర్మాణ దశలో ఉద్యోగ నియమాకాల్లో అన్యాయం జరుగుతోందని, ఆంధ్రా ప్రజలు అధికశాతం తీసుకుపోతు న్నారన్న ఆవేదనతో ఇడ్లీ సాంబారు గోబ్యాక్ అంటూ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఆంధ్రా నుంచి వలస వచ్చిన వారికి వ్యతి రేకంగా ఆనాడు పోరాటం చేయగా ఆ తర్వాత ఆ ఉద్యమం ఇల్లెందుకు వ్యాపిం చింది.
ఇక ఉస్మానియాలో చదివే తెలంగాణ విద్యార్ధులకు సీట్లు రావడంలేదని ఖమ్మంలో అన్నాబత్తుల రవీంద్రనాధ్ ఆధ్వర్యంలో 14రోజులు చేసిన నిరాహారదీక్ష తెలంగాణ ప్రాంతంలో తొలి దశ ఉద్యమానికి బీజం వేసింది. సింగరేణి కార్మికులు, కేటీపీఎస్ కార్మికులు తమ ఉద్యోగాలు తమకు కావాలని చేసిన పోరాట ఫలితంగా స్ధానికులకు ఉద్యోగాలు ఇచ్చే 610 జీవోకు బీజం పడింది. తొలి దశ ఉద్యమం ముగిసిన అనంతరం రాష్ట్ర సాధన ఉద్యమం కొంత పక్కకు పోయినా మళ్లీ కేసీఆర్తో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, కోదండరామ్, గద్దర్ తదితరుల సారథ్యంలో ఉద్యమం ఊపిరి పోసుకుంది. నిధులు, నీళ్లు, నియమాకాల ఆకాంక్షతో మొదలైన మలి దశ రాష్ట్ర సాధన ఉద్యమం అనతికాలంలోనే ప్రజల్లోకి వెళ్లింది. ఖమ్మంజిల్లాలో అన్ని రాజకీయపార్టీలు ప్రజాసంఘాలు, కార్మిక, విద్యార్ధి, యువజన, మహిళ, ఉద్యోగ సంఘాలు జై తెలంగాణ నినాదం అందుకున్నాయి. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్న నినాదంతో 2009లో అప్పటి టీఆర్ఎస్ నేతగా ఉన్న కేసీఆర్ ఉద్యమాన్ని ఉదృతం చేసి కరీంనగర్లో అరెస్టయి ఖమ్మం రావడం, ఖమ్మం జైలులో ఉంచడం, జైలులో కూడా కేసీఆర్ దీక్ష చేపట్టడం, ఆసుపత్రికి తరలించిన దీక్ష కొనసాగించడం. ఖమ్మం ఆసుపత్రి వద్ద అప్పటి టీఆర్ఎస్తోపాటు సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున సంఘీభావం పలకడం ఆనాటి పోరాటంలో ముఖ్య ఘట్టాలుగా నిలిచాయి.
రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ విద్యార్ధులు తెలంగాణ ఉద్యమానికి కదం తొక్కడంతో ఆనాటి హోం శాఖ మంత్రి చిదంబరం 2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని ప్రకటన చేశారు. అయితే, ఆ తర్వాత మళ్లీ అనేక అవరోధాలు ఏర్పడటంతో ఖమ్మం జిల్లా మళ్లీ ఉద్య మానికి నడుం బిగించి నడిచింది. సకల జనుల సమ్మెలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, ప్రభుత్వ ఉద్యో గులు, అదికారులు, పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉద్యమించటంతో ఉద్యమం తారాస్ధాయికి చేరింది. అనంతరం పలు పరిణామాల నేపధ్యంలో 2014 జూన్ 2న పార్లమెంట్ బిల్లుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.


