బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారా..? పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందా..? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారా…? కవిత అరెస్టుపై గులాబీ బాస్ ఏమంటున్నారు..?
బీఆర్ఎస్ నేతలతో తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గా ల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సంవత్సరం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని కూడా కేసీఆర్ అన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీకి 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ ప్రయత్నించారని ఆరోపించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తారని అన్నారు. దీంతో కేసీఆర్ కామెంట్స్ తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు తన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్పై కేసీఆర్ స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమే అన్నారు. మద్యం పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శించారు. బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో తాము బీఎల్ సంతోష్పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామన్నారు. అందుకే కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక రాష్ట్రంలో 22వ తేదీ నుండి బస్సు యాత్ర ఉంటుందని నేతలతో కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూట్ మ్యాప్ ఇవ్వాలని అన్నారు. జిల్లాల్లో నైట్ హాల్ట్ సైతం ఉంటానని తెలిపారు. వరంగల్, ఖమ్మం, మహ బూబ్ నగర్, సిద్దిపేట ప్రాంతాల్లో బహిరంగ సభలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఒక్కో లోక్ సభ నియోజకవర్గం పరిధి లో రెండు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్డు షోలు ఉండేలా ప్లాన్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న 500 రూపాయల బోనస్ ఇచ్చే వరకు రైతుల వద్దకు వెళ్ళడంతో పాటు కల్లాల్లో నిరసనలు చేసే విధంగా నేతలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ నిర్వహించిన తొలి సమావేశం నేతల్లో కాన్ఫిడెన్స్ నింపే విధంగా జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి బస్సు యాత్ర ద్వారా ప్రచారం నిర్వహించనున్న కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీని ఏ విధంగా ముందుకు నడుపుతారో చూడాలి.