దేశ చరిత్రలోనే సంచలన నిర్ణయం తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నారు. ముందుగా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల సమస్యలే ఎజెండాగా ముందుకు పోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి సారించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని భావిస్తుండడంతో దానినే కేసీఆర్ తన అస్త్రంగా మల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనేలా చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం జయేశ్ రంజన్ నేతృత్వంలో ఓ బృందాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఈనెల 15న బిడ్డింగ్ ఉండడంతో ఆలోపు అధికారులు విశాఖ వెళ్లి కార్మికులు, ఉద్యోగులతో భేటీ అయి వారి అభిప్రాయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఉక్కు కర్మాగారం ప్రైవేణీకరణను కేసీఆర్ అనేకసార్లు తప్పుబట్టారు. మంత్రి కేటీఆర్ కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.
బిడ్డింగ్ లో పాల్గొని ప్లాంట్ ను తెలంగాణ ప్రభుత్వం సాధిస్తే ఏపీ ప్రజలకు దగ్గరకావొచ్చని కేసీఆర్ మాస్టర్ ప్లాన్. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చేయలేని పనిని తాము చేసి చూపించామనే ఆలోచనను ప్రజల్లోకి తీసుకువెళ్లొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ తరహా పోరాటం ఏపీలో చేయడానికి కేసీఆర్ కు మార్గం సుగమం అవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలనే కేసీఆర్ నిర్ణయం.. ఇటు కేంద్రాన్ని ఢీకొట్టడంతో పాటు అటు ఏపీ ప్రజలకు కూడా దగ్గర అయ్యే ఛాన్సు గా అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం విశాఖ స్టీల్ బిడ్డింగ్ లో పాల్గొనుందనే వార్తల నేపథ్యంలో ఏపీలోని ప్రతిపక్షాలు సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బిడ్డింగ్ లో తెలంగాణ పాల్గొంటే జగన్ కు ఆత్మహత్యే శరణ్యమని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ధైర్యముంటే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి ప్రైవేటీకరణ ఆపాలని.. లేదంటే సీఎం పదవి నుంచి దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.